23 ఏళ్ల క్రితం టీచర్ అత్యాచారం... న్యాయవాదిగా మారి బేడీలు వేయించిన విద్యార్థిని!

ABN , First Publish Date - 2020-10-17T01:33:15+05:30 IST

23 ఏళ్ల క్రితం తనపై అత్యాచారానికి ఒడిగట్టి చీకటి కలను మిగిల్చిన కీచక టీచర్‌పై ఓ విద్యార్థిని..

23 ఏళ్ల క్రితం టీచర్ అత్యాచారం... న్యాయవాదిగా మారి బేడీలు వేయించిన విద్యార్థిని!

సిలిగురి: 23 ఏళ్ల క్రితం తనపై అత్యాచారానికి ఒడిగట్టి చీకటి కలను మిగిల్చిన కీచక టీచర్‌పై ఓ విద్యార్థిని తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికీ ఆ మానవ మృగం చిన్నారులను చిదిమేస్తున్నట్టు తెలుసుకుని కటకటాల వెనక్కి నెట్టించింది. నాడు ముక్కుపచ్చలారని వయసులో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆమె ఇప్పుడు హాంకాంగ్‌లో ఓ ప్రఖ్యాత న్యాయవాదిగా స్థిరపడ్డారు. డార్జీలింగ్ హోంలో చదువుతున్నప్పుడు 14 ఏళ్ల తనపై తన ప్రయివేటు ట్యూటర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతేడాది ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం 40వ పడిలో ఉన్న సదరు ఉపాధ్యాయుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు హాంకాంగ్ నుంచి మాట్లాడుతూ  ‘‘చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇది కేవలం చిన్న విజయం మాత్రమే. ఆ దుర్మార్గుడి బెయిల్ దరఖాస్తు ఇటీవల తిరస్కరణకు గురైంది. అతడిపై అత్యంత కట్టుదిట్టంగా కేసు కట్టిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అని పేర్కొన్నారు.


నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు రెండు దశాబ్దాలకు పైగా ఎందుకు సమయం పట్టిందంటూ ఆమెను ప్రశ్నించగా... ‘‘అప్పట్లో నేను చాలా భయపడ్డాను. తీవ్ర గందరగోళానికి గురయ్యాను. ఈ దారుణాన్ని ఎలా ఎదిరించాలన్న అవగాహన నాకు లేదు. లైంగిక వేధింపులు, అత్యాచారాలపై ఆధారాలతో ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడం చాలా కష్టం. ప్రత్యేకించి మనసులో ఎక్కడో సమాధి చేసిన తర్వాత అది మరింత కష్టం. నిందితుడు ఇప్పటికీ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసి.. అతడిపై ఎలాగైనా ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను.. ’’ అని ఆమె పేర్కొన్నారు. ఆనాటి పీడకల గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ కష్టంగానే ఉందని సదరు న్యాయవాది పేర్కొన్నారు. ‘‘దాదాపు నెల రోజుల పాటు అతడు నాకు నరకం చూపించాడు. ఆ పీడకల ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. మిగతా పిల్లలు అతడి బారిన పడకుండా ఆపాలని నిర్ణయించుకున్నాను...’’ అని ఆమె అన్నారు. 


కాగా ఈ కేసుపై డార్జీలింగ్ డిప్యూటీ ఎస్పీ రాహుల్ పాండే మాట్లాడుతూ... ‘‘ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. సిలిగురిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న అతడిని అక్టోబర్ మొదట్లో అదుపులోకి తీసుకున్నాం...’’ అని పేర్కొన్నారు. అతడి అకృత్యాలపై స్పష్టమైన ఆధారాలు లభించాయనీ.. ఇప్పటి వరకు నలుగురు బాధితులతో మాట్లాడి ఆధారాలు సేకరించామని పాండే పేర్కొన్నారు. ‘‘నిందితుడు కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ అతడు ఓ స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కి మారుతుంటాడు. గత 20 ఏళ్లలో కనీసం అతడు 5 స్కూళ్లు మారినట్టు గుర్తించాం. ఈ నెల 23 వరకు కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది..’’ అని పాండే వివరించారు. కాగా నిందితుడికి ఆధారాలు చూపించి నిలదీయగా.. అతడు నేరం చేసినట్టు అంగీకరించాడని డీఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-17T01:33:15+05:30 IST