Silicon Andhra: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా మారేపల్లి నాగవేంకటశాస్త్రి షష్ట్యబ్ది ఉత్సవం

ABN , First Publish Date - 2022-07-19T14:17:06+05:30 IST

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో బే ఏరియా తెలుగు వారంతా కలిసి మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డా. లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి 60వ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు.

Silicon Andhra: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా మారేపల్లి నాగవేంకటశాస్త్రి షష్ట్యబ్ది ఉత్సవం

మిల్ పిటాస్, కాలిఫోర్నియా: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో బే ఏరియా తెలుగు వారంతా కలిసి మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డా. లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి 60వ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. వేద (Vedic Education and Devotional Academy) సంస్థ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన పూజారి అయిన నాగవేంకటశాస్త్రి ఒక్క తెలుగు వారికే కాక బే ఏరియాలోని భారతీయులందరికీ సుపరిచుతులు. వీరు ఒక్క పురోహితులే  కాక ఆధ్యాత్మిక గురువు కూడా. ఎందరికో సంస్కృత వ్యాకరణం, వేద పఠనం నేర్పుతూ అమెరికాలో ఆర్షసంప్రదాయాన్ని నిలబెట్టడానికి తనవంతు కృషి చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షకుడు. శాస్త్రి శిష్యులు, శ్రేయోభిలాషులు, పురజనులంతా వీధికి రెండువైపులా నిలబడి పువ్వులు, మంగళ ద్రవ్యాలు చల్లుతుండగా, సిలికానాంధ్ర సైనికులు పండితుల వేదపఠనాల మధ్య, శ్రీ శాస్త్రిగారిని అందంగా అలంకరించిన పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగింపుగా సభలోకి తీసుకువచ్చి తమ గురుభక్తిని, ఆయనపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. 


కుమారి ఆరుషి అయ్యగారి గణపతి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. సిలికానాంధ్ర ఆవిర్భావం నుండి నేటి వరకు 21 సంవత్సరాల పాటు వారి వేదపఠనంతోనే తమ సంస్థ కార్యక్రమాలు మొదలవుతాయని తెలిపారు. వారితో సంస్థకు ఉన్న ప్రగాఢ అనుబంధాన్ని సభికులకు తెలియజేసారు.  రావు తల్లాప్రగడ బృందం శాస్త్రి జననం నుంచి నేటి వరకు వారు సాధించిన విజయాలను, సనాతన ధర్మ వ్యాప్తికి వారుచేస్తున్న కృషిని ఒక ఏవీ(AV) రూపంలో ప్రేక్షకులకు ప్రదర్శించారు. కుమారి ఈష,  కుమారి శ్రీమయి లక్ష్మీ చాగంటిల శాస్త్రీయ నృత్య ప్రదర్శనల తరువాత వేద మంత్రాలతో శాస్త్రి దంపతులను వేదిక మీదకు తీసుకువచ్చి, సిలికానాంధ్ర సభ్యులు శాస్త్రోక్తంగా గురుపూజ నిర్వహించారు. 


అనంతరం శాస్త్రితనకు కూచిభొట్ల ఆనంద్‌తో గల పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఇది కాకతాళీయం కాదని, పూర్వజన్మల సంబంధమని పేర్కొన్నారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను స్వయంగా వ్రాసిన రెండు కవితలను చదివి వినిపించారు. ఆ భావకవితలు సభికులను చాలా ఆకట్టుకున్నాయి. ప్రస్తుత దేవస్థానం అధ్యక్షులు దయాకర్ దువ్వూరు  మాట్లాడుతూ ఇలా ఒక గొప్ప వ్యక్తికి, గురువుకి సన్మానం చేయడం మన బాధ్యత అని, తనూ ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమానంతరం, అతిధులందరికీ అచ్చ తెలుగు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడానికి విశేష కృషి చేసిన సిలికానాంధ్ర నాయకత్వ సభ్యులు, కొండిపర్తి దిలీప్, కందుల సాయి, సంగరాజు దిలీప్, శివ పరిమి, ప్రియ, తనుగుల సింహాద్రి, కిరణ్‌ను అభినందించారు.





Updated Date - 2022-07-19T14:17:06+05:30 IST