ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం
ABN , First Publish Date - 2020-08-04T11:16:43+05:30 IST
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ నిర్వాకం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రేమ పేరుతో మోసం.. దుబాయ్ నుంచి పలాయనం
నువ్వెవరో తెలియదంటున్న వైనం
కొమరోలు, ఆగస్టు 3 : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ నిర్వాకం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నాడు ప్రేమ పేరుతో పరిచయమై ఒకరినొకరు దగ్గరయ్యారు. దాని ఫలితంగా చిన్నారికి జన్మనిచ్చారు. నేడు నువ్వెవరో నాకు తెలిదని మొహం చాటేస్తున్న ప్రియుడి నిర్వాకం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే... మండలంలోని అల్లినగరానికి చెందిన ఆవులమంద శేఖర్తో కడప జిల్లా చెన్నూరుకు చెందిన నాగమణికి మూడేళ్ల క్రితం దుబాయ్లో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. వారికి పాప కూడా ఉంది. ఈ క్రమంలో వారి మధ్య వివాదం రేగింది.
దుబాయ్ నుంచి 6 నెలల క్రితం ఆ వ్యక్తి అల్లినగరానికి చేరుకున్నాడు. రెండు నెలలక్రితం నాగమణి కూడా దుబాయ్ నుంచి చెన్నూరుకు వచ్చింది. శేఖర్ మోసంపై చెన్నూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడ న్యాయం జరగలేదు. దీంతో అల్లినగరంలోని ప్రియుడి ఇంటి వద్ద ఆమె మౌనదీక్షకు దిగింది. ఆమె రాకను తెలుసుకున్న వారు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.