కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
ABN , First Publish Date - 2022-05-21T08:00:33+05:30 IST
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్లోని పాటియాలా జిల్లా కోర్టులో శుక్రవారం లొంగిపోయారు.
న్యూఢిల్లీ, మే 20 : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ పంజాబ్లోని పాటియాలా జిల్లా కోర్టులో శుక్రవారం లొంగిపోయారు. మూడు దశాబ్దాల క్రితం రోడ్డుపై జరిగిన ఘర్షణలో 34 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో సిద్ధూను దోషిగా నిర్ధారించిన సుప్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చిన విషయం విదితమే. జైలు శిక్షపై ట్విటర్ వేదికగా గురువారం స్పందించిన సిద్ధూ ‘తీర్పును శిరసావహిస్తా’ అని పేర్కొన్నారు. అయితే, తాను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొన్ని వారాల గడువు ఇవ్వాలని శుక్రవారం ఉదయం సిద్ధూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిద్ధూ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ పిటిషన్ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ముందు ఉంచారు. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పునిచ్చినందున ఈ అభ్యర్ధనపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను ఫైల్ చేసుకోవాలని సూచించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం పాటియాలాలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన సిద్ధూ న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, పాటియాలా జైలుకు తరలించారు.