Navjot Singh Sidhu : పాటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ

ABN , First Publish Date - 2022-05-21T00:05:45+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot

Navjot Singh Sidhu : పాటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ

పాటియాలా : పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) శుక్రవారం పాటియాలాలోని ఓ కోర్టులో లొంగిపోయారు. 34 ఏళ్ల క్రితం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణానికి కారకుడైనందుకు ఆయనకు సుప్రీంకోర్టు ఓ ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన అనారోగ్య కారణాలను చూపుతూ లొంగిపోయేందుకు మరికొన్ని వారాల సమయం ఇవ్వాలని కోరారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించడం సాధ్యం కాలేదని సిద్ధూ సన్నిహితులు తెలిపారు.


సిద్ధూ శుక్రవారం సాయంత్రం దాదాపు 4 గంటలకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అమిత్ మల్హన్ సమక్షంలో హాజరయ్యారు. అనంతరం కన్విక్షన్ వారంట్‌పై అమిత్ సంతకం చేశారు. సిద్ధూను పాటియాలా కేంద్ర కారాగారానికి పంపించాలని ఆదేశించారు. మాతా కౌసల్య ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలుకు తరలించారు. ఇదిలావుండగా, సిద్ధూ వస్తుండటంతో, ఈ జైలులో భద్రతా ఏర్పాట్లను పంజాబ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ వీ కుమార్ పరిశీలించారు. 


34 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలో ఓ వ్యక్తి మరణానికి కారణమైనందుకు సిద్ధూకు ఒక ఏడాది కఠిన కారాగారవాస శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం తీర్పు చెప్పింది. సిద్ధూ తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి (Abhishek Manu Singhvi) శుక్రవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. సిద్ధూ అనారోగ్యంతో బాధపడుతున్నారని, కోర్టులో లొంగిపోయేందుకు మరికొన్ని వారాల గడువు ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పంజాబ్ (Punjab) ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. 34 ఏళ్ళు పూర్తయింది కాబట్టి నేరం మరణించినట్లు కాదన్నారు. ఇప్పటికి తీర్పు వచ్చిందని, మరో మూడు, నాలుగు వారాల గడువు కావాలని మళ్ళీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ, సిద్ధూ లొంగిపోతారని, గడువు కోసం చేసిన విజ్ఞప్తిని పరిశీలించడం న్యాయమూర్తి విచక్షణపై ఆధారపడి ఉందని అన్నారు. దీనిపై జస్టిస్ ఖన్విల్కర్ స్పందిస్తూ, CJI జస్టిస్ రమణ ధర్మాసనం వద్ద దరఖాస్తు చేయాలని, తాము పరిశీలిస్తామని చెప్పారు.  కానీ జస్టిస్ రమణ ధర్మాసనానికి ఈ అంశాన్ని నివేదించడం సాధ్యం కాలేదని సిద్ధూ సన్నిహితులు తెలిపారు.


ఈ కేసులోని వివరాల ప్రకారం, 1988 డిసెంబరు 27న పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పార్కింగ్ స్పాట్ వద్ద సిద్ధూ, ఆయన మిత్రుడు రూపిందర్ సింగ్ సంధు, గుర్నామ్ సింగ్ మధ్య ఘర్షణ జరిగింది. గుర్నామ్ సింగ్‌ను ఆయన కారు నుంచి మిగిలిన ఇద్దరూ బయటకు లాగి, కొట్టారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుర్నామ్‌ తలపై సిద్ధూ కొట్టినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. 


Updated Date - 2022-05-21T00:05:45+05:30 IST