సిద్దూకు ఏడాది జైలు!
ABN , First Publish Date - 2022-05-20T08:31:48+05:30 IST
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
1988 నాటి కేసులో సుప్రీం తీర్పు
గతంలో 1000 జరిమానాతో సరి
తాజాగా శిక్ష కూడా విధింపు
న్యూఢిల్లీ, మే 19: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్ష ణ కేసులో ఈ మేరకు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 1988లో నమోదైన కేసులో సిద్ధూను రూ.1000 జరిమానాతో విడిచి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. 1988 డిసెంబరు 27న పటియాలాలో కారు పార్కింగ్ విషయమై గుర్నామ్సింగ్(65)కు.. సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపీందర్సింగ్కు మధ్య ఘర్షణ జరిగింది. సిద్ధూ, సంధూలు గుర్నామ్ సింగ్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గుర్నామ్ను ఆస్పత్రికి తర లించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పటియాలాలోని సెషన్స్ కోర్టు నుంచి పంజాబ్-హరియాణా హైకోర్టుకు, ఆపై సుప్రీం కోర్టుకు ఈ కేసు చేరింది. గుర్నామ్ సింగ్ను హత్య చేశారనేందుకు ఆధారాల్లేవన్న సుప్రీం బెంచ్.. అతడిని గాయపరిచినందుకు సిద్ధూను దోషిగా తేల్చుతూ రూ.1000 జరిమానాతో సరిపెట్టింది. దీనిపై గుర్నామ్ సింగ్ కుటుంబం రివ్యూ పిటిషన్ వేసింది. సుప్రీంతీర్పును గౌరవిస్తానని సిద్ధూ ట్విటర్లో పేర్కొన్నారు.