అర్ధరాత్రి యువకుడిపై ఎస్‌ఐ దాష్టీకం

ABN , First Publish Date - 2022-06-26T07:34:22+05:30 IST

అర్ధరాత్రి యువకుడిపై ఎస్‌ఐ దాష్టీకం

అర్ధరాత్రి యువకుడిపై ఎస్‌ఐ దాష్టీకం

అకారణంగా దాడి.. సీసీ కెమెరాలో రికార్డు

ఎస్‌ఐ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు

విచారణకు ఆదేశించిన ఎస్పీ 

చెరుకుపల్లి, బాపట్ల, జూన్‌ 25 : తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని అర్ధరాత్రి మందులు, బ్రెడ్‌ తీసుకొచ్చేందుకు వెళ్లిన యువకుడిపై ఓ ఎస్‌ఐ అకారణంగా దాడిచేశాడు. బాధితుడి కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గుళ్లపల్లికి చెందిన మున్నా బిర్యానీ రెస్టారెంట్‌ నిర్వహిస్తుంటాడు. శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో మందుల కోసమని అతడి కొడుకు పఠాన్‌ హబీబుల్లా.. స్నేహితుడితో కలిసి రాత్రి 11.20 గంటల సమయంలో చెరుకుపల్లికి వస్తున్నాడు. అంబేడ్కర్‌ సెంటర్‌ వద్దకు వచ్చే సరికి ఎస్‌ఐ కొండారెడ్డి వారిని ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించాడు. మందులకు వెళుతున్నామని ఎంత బతిమిలాడినా వినకుండా ఎస్‌ఐ తనను ఇష్టం వచ్చినట్లు కొట్టాడని హబీబుల్లా తెలిపాడు. ఈ విషయాన్ని హబీబుల్లా తండ్రి మున్నాకు ఫోన్‌లో వివరించగా, ఆయన ఎస్‌ఐకు ఫోన్‌ చేసి తానే తన కుమారుడిని మందుల నిమిత్తం పంపినట్లు  తెలిపారు. అయితే.. ‘నువ్వు ఈ సమయంలో నాకు ఫోన్‌ చేసేంతవాడివా.. అని దుర్భాషలాడి..  మీరిద్దరూ రేపు ఉదయం స్టేషన్‌కు వచ్చి ఫోన్‌ తీసుకువెళా’్లలని వారి నుంచి ఫోన్‌ లాక్కున్నాడు. చేసేదిలేక తిరిగి ఇంటికి వెళ్లేందుకు పెట్రోల్‌ కొట్టించుకుందామని పెట్రోల్‌ బంక్‌కు హబీబుల్లా వెళ్లాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఎస్‌ఐ కొండారెడ్డి.. హబీబుల్లాపై మరోమారు విచక్షణారహితంగా దాడిచేసి కొట్టాడు. పెట్రోలు బంకులోని సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. దాడి చేసిన సమయంలో ఎస్‌ఐ మద్యం మత్తులో ఉన్నాడని బాధితుడు తెలిపాడు. 


సీజ్‌ చేసిన కారును ఫొటోలు తీశారని..

ఎస్‌ఐ కొండారెడ్డి ఓ కేసులో సీజ్‌ చేసిన ఓ కారులో పెట్రోల్‌ బంకుకు వచ్చి పెట్రోల్‌ కొట్టించుకుంటున్నాడు. ఆ కారును సొంత పనుల నిమిత్తం వాడుకుంటున్నాడని.. హబీబుల్లా స్నేహితునితో కలిసి ఫొటోలు తీస్తున్నారనే అనుమానంతో దాడిచేసి ఇష్టానుసారంగా కొట్టినట్లు సమాచారం.  ఈ విషయమై ఎస్‌ఐ కొండారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించంగా అందుబాటులో లేరు. రేపల్లె రూరల్‌ సీఐ శివశంకర్‌వివరణ కోరగా.. ఆ కారును కోర్టులో అప్పగించేందుకు పెట్రోల్‌ కొట్టించుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి కోర్టుకు అప్పగించటమేంటని విలేకరులు ప్రశ్నించగా.. కోర్టులో ఏ సమయంలోనైనా అప్పగించవచ్చని వాఖ్యానించారు. అయితే, ఆ కారు శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో చెరుకుపల్లి పోలీ్‌సస్టేషన్లో ప్రత్యక్షమవటం  పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి విషయంపై ప్రశ్నించగా అలాంటి సంఘటన జరగలేదని చెప్పారు.


విచారణకు ఆదేశించిన ఎస్పీ 

ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని బాపట్ల డిఎస్పీ ఎ.శ్రీనివాసరావును ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని విలేకరులకు తెలిపారు. 

Updated Date - 2022-06-26T07:34:22+05:30 IST