మూతపడ్డ ఆర్వో ప్లాంటు
ABN , First Publish Date - 2022-07-06T06:41:48+05:30 IST
మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని జంగంరెడ్డిపల్లె కాలనీలో నిర్మించిన ‘గ్రామీణ సామాజిక శుద్ధ తాగునీటి కేంద్రం’ (ఆర్వో ప్లాంట్)ను ఇంచుమించు ఎనిమిది నెలల క్రితం ప్రారంభించారు.
తర్లుపాడు, జూలై 5 : మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని జంగంరెడ్డిపల్లె కాలనీలో నిర్మించిన ‘గ్రామీణ సామాజిక శుద్ధ తాగునీటి కేంద్రం’ (ఆర్వో ప్లాంట్)ను ఇంచుమించు ఎనిమిది నెలల క్రితం ప్రారంభించారు. ఆ ప్లాంట్ మూడు రోజుల ముచ్చటగా మారిందని ప్రజలు వాపోతున్నారు. రూ.12.20 లక్షలతో నిర్మించిన ప్లాంట్ గత 45 రోజుల క్రితం మూతబడింది. విద్యుత్ సమస్యతోనే మూతపడిందని సిబ్బంది తెలిపారు. అప్పటి నుంచి పట్టించుకునే నాథుడే కరవయ్యారు. దీంతో కాలనీ వాసులు తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. కాలనీలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండటంతో ఆర్వో ప్లాంట్ను మంజూరు చేసింది. ప్రస్తుతం అది మూత పడడంతో ఫ్లోరిన్ నీరు తాగాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్ను తెరిపించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి హనుమాన్ నాయక్ మాట్లాడుతూ... విద్యుత్ బిల్లులు చెల్లించక పోవడంతో మూతపడినట్లు తెలిపారు. త్వరలోనే పునఃప్రారంభిస్తామన్నారు.