హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు తగదు
ABN , First Publish Date - 2020-07-10T10:15:01+05:30 IST
పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల విషయంలో ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తగదని ..
వెంటనే ఉపసంహరించుకోండి
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
గుజరాతీపేట: పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల విషయంలో ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తగదని ఏపీటీఎఫ్ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, ప్రఽధాన కార్యదర్శులు, గౌరవాధ్యక్షుడు కవిటి పాపారావు, టెంక చలపతిరావు, గురుగుబెల్లి బాలాజీరావులు ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు-నేడు పనులు వేగవంతం కావడం లేదని జిల్లాలోని 399 మంది ప్రధానోపా ధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులను జారీ చేయడం దారుణమన్నారు. నాడు- నేడు పనులకు సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ శాఖ అధికారు లు, గ్రామ సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సి ఉందన్నారు. కానీ, ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేయడం సమంజసం కాదన్నారు. వెంటనే షాకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డీఈవో చంద్రకళకు విజ్ఞప్తి చేశారు.
షోకాజ్ నోటీసులతో హెచ్ఎంల ఆత్మస్థైర్యం దెబ్బతిందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పప్పల రాజశేఖరరావు, ప్రధాన కార్యదర్శి బత్తుల రవికుమార్ పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని పీఆర్టీయూ నాయకులతో కలసి వారు డీఈవో చంద్ర కళకు గురువారం వినతిపత్రం అందజేశారు. లేబర్ చార్జీల బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేయలేదనే కారణంతో హెఎంలకు షోకాజ్ జారీ చేయడం తగదన్నారు.
కవిటి: హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీచేయడం తగదని ఏపీటీఎఫ్-1938శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బల్ల ధర్మారావు, శిమళ్ల రాజబాబు ఒక ప్రకటనలో గురువారం పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమాల్లో భాగంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి అవరసమైన పనులు గుర్తించారని తెలిపారు. ఏరోజుకు ఆరోజు ఆన్ లైన్లో బిల్లులు నమోదు చేయడం లేదన్న కారణంతో నోటీసులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.