ముంబైలో వ్యాక్సీన్ కొరత: టీకా కేంద్రాల ముందు జనం బారులు
ABN , First Publish Date - 2021-07-21T12:00:04+05:30 IST
ఒక వైపు ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండగా...
ముంబై: ఒక వైపు ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండగా, మహారాష్ట్రలో ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. ముఖ్యంగా ముంబై మహానగరంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. ముంబైలోని బీకేసీ జంబో కోవిడ్ టీకా కేంద్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. టీకాలు వేయించుకునేందుకు ఉదయం నుంచే కేంద్రం ఎదుట జనం బారులు తీరుతున్నారు. పరిమిత మోతాదులోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని గ్రేటర్ మున్సిపల్ అధికారులు ముందుగానే తెలియజేశారు. టీకాలు వేయకుండానే చాలా మందిని వెనక్కి పంపించారు. దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యాక్సీన్ కోసం ఉదయం నుంచి టీకా కేంద్రం ఎందుట తన వంతు కోసం ఎదురుచూస్తున్న స్థానికుడు సంతోష్ పాండే మాట్లాడుతూ తాను ఉదయం 7 గంటల నుంచి వరుసలో నిలబడి ఉన్నానని, ఇప్పుడు అధికారుల వచ్చి, మొదటి మోతాదుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని చెబుతున్నారని ఆరోపించాడు. టీకా అందుబాటులోకి వచ్చినప్పుడు అందరికీ సమాచారం ఇస్తామని అధికారులు చెబుతున్నారని తెలిపాడు. టీకా అందకపోవడంతో చాలా మంది నిరాశతో తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు. కాగా జూలై ప్రారంభం నుంచి ముంబైలో వ్యాక్సిన్ కొరత ఎదురవుతోంది.