చెప్పులతో సోషల్ డిస్టెన్సింగ్... అద్భుతం అంటున్న జనం!
ABN , First Publish Date - 2020-06-01T11:33:51+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ వ్యాధిని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రొమేనియాలో సోషల్ డిస్టెన్సింగ్...
బుకారెస్ట్: కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఈ వ్యాధిని నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే రొమేనియాలో సోషల్ డిస్టెన్సింగ్ బూట్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఈ చెప్పులు సామాజిక దూరాన్ని కొనసాగించేందుకు ఎంతగానో సహాయపడుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రొమేనియాలో సుమారు రెండు నెలల పాటు లాక్డౌన్ అమలులో ఉంది. అయితే దానిని సడలించినప్పుడు అక్కడి జనం సామాజిక దూరాన్ని పాటించలేదు. దీనిని గమనించిన షూ షో రూం యజమాని సామాజిక దూరాన్ని పాటించేందుకు అనువైన బూట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ట్రాన్సిల్వేనియా నగర పరిధిలోని క్లూజ్కు చెందిన షూ తయారీదారు గ్రిగర్ లుప్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదని గమనించాడు. దీంతో సామాజిక దూరం పాటించేందుకు అనువైన చెప్పులు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అనుకున్న పనిలోపడ్డాడు. ఈ బూట్లు యూరోపియన్ సైజు సంఖ్య 75లో రూపొందించాడు. 39 సంవత్సరాలుగా తాను తోలు బూట్లు తయారు చేస్తున్నానని లూప్ చెప్పాడు. లుప్ తన దుకాణాన్ని 2001లో ప్రారంభించాడు. ఇప్పుడు అదే దుకాణంలో ఈ బూట్లు విక్రయిస్తున్నాడు. ఈ షూ ధరించడం ద్వారా ప్రజల మధ్య ఒకటిన్నర మీటర్ల దూరం ఉంటుందని లుప్ చెప్పాడు. ఈ బూట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షూస్ను చూసిన వారంతా సోషల్ డిస్టెన్సింగ్కు ఇది చక్కని పరిష్కారమంటున్నారు.