షోడశ విద్యాధిదేవత

ABN , First Publish Date - 2020-10-18T06:03:56+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

షోడశ విద్యాధిదేవత

నేటి అలంకారం 

శ్రీ బాలాత్రిపురసుందరీదేవి

ఆశ్వయుజ శుద్ధ విదియ, ఆదివారం


హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాం బిభ్రతీం

సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలామ్‌

వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితామజ్జ్వలాం

తాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీమ్‌


శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు అమ్మవారు  బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా గొప్పదనీ ఆధ్యాత్మికులు చెబుతారు. అందుకే శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదటగా 

ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. బాలాత్రిపుర సుందరీదేవి చతుర్భుజాలతో ఉంటారు. జపమాల, పుస్తకం ధరించి, అభయ, వరద హస్తాలతో కరుణిస్తారు. కలువ పువ్వులో ఆసీనురాలై, సమస్త శుభాలను ప్రసాదించే దివ్యమంగళ రూపంతో మూడేళ్ల బాలికగా భక్తులకు దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో బాలాత్రిపుర సుందరీదేవి మొదటి స్వరూపం. మహాత్రిపురసుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో తొలి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని పెద్దలు చెబుతారు.


షోడశ విద్యలకు ఆమె అధిష్ఠాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ‘లలితా త్రిశ తి’ పారాయణం చేస్తుంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయంటారు. ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయనీ, సకల దారిద్ర్యాలు నశిస్తాయనీ, జ్ఞానం కలుగుతుందనీ, జీవనోపాధి లభిస్తుందనీ, చదువులలో ఉన్నతులవుతానీ అనాదిగా భక్తుల నమ్మకం.


నైవేద్యం: పాయసం, పులగం

అలంకరించే చీర రంగు: లేత గులాబీ రంగు

అర్చించే పూల రంగు: అన్ని రకాలూ!

పారాయణ:: లలితా త్రిశతి


Updated Date - 2020-10-18T06:03:56+05:30 IST