పెళ్లయి 12 ఏళ్లయినా భార్యను తీసుకెళ్లని NRI.. అసలు కథేంటని నిలదీస్తే ఆ భర్త చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-01-27T20:50:45+05:30 IST

వాళ్లిద్దరికీ 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత భర్త వ్యాపారం నిమిత్తం రష్యా వెళ్లాడు..

పెళ్లయి 12 ఏళ్లయినా భార్యను తీసుకెళ్లని NRI.. అసలు కథేంటని నిలదీస్తే ఆ భర్త చెప్పింది విని..

వాళ్లిద్దరికీ 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత భర్త వ్యాపారం నిమిత్తం రష్యా వెళ్లాడు.. త్వరలోనే తననూ తీసుకెళ్తాడని భార్య ఎదురుచూస్తూ ఉంది.. అతను రెండేళ్లకు ఒకసారి వచ్చి ఉండి మళ్లీ వెళ్లిపోతున్నాడు.. భార్యను మాత్రం తీసుకెళ్లడం లేదు.. దీంతో ఆమె భర్తను కోపంగా ప్రశ్నించింది.. అప్పుడు అతను అసలు విషయం బయటపెట్టాడు.. రష్యాలో తను మరో వివాహం చేసుకున్నానని చెప్పాడు.. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన దీపిక అనే మహిళ 2009లో అదే ప్రాంతానికి చెందిన భగవాన్ దాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. 2011లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. వస్త్ర వ్యాపారం చేసే భగవాన్ దాస్ 2014లో రష్యాలోని మాస్కోకు వెళ్లాడు. భార్యను, కొడుకును తర్వాత తీసుకెళ్తానని చెప్పాడు. 2016లో భారత్‌కు తిరిగి వచ్చి కుటుంబంతో కొద్ది రోజులు గడిపి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2018లో వచ్చి మళ్లీ ఒక్కడే తిరిగి వెళ్లిపోయాడు. 2020లో భగవాన్ దాస్ భారత్ తిరిగి వచ్చినపుడు దీపిక గట్టిగా నిలదీసింది. 


తమను కూడా రష్యా తీసుకెళ్లాలని పట్టుబట్టింది. దీంతో భగవాన్ దాస్ అసలు విషయం బయటపెట్టాడు. తాను రష్యాలో మరో యువతిని వివాహం చేసుకున్నానని, ఓ కొడుకు కూడా ఉన్నాడని చెప్పాడు. పెళ్లి ఫొటోలు కూడా చూపించాడు. అనంతరం రష్యా వెళ్లిపోయాడు. దీంతో దీపిక కుటుంబ పెద్దలను ఆశ్రయించి భర్తను, అతని కుటుంబాన్ని ప్రశ్నించింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన మోసాన్ని వివరించింది. తన భర్త వీసా గడువు ఈ ఏడాది అక్టోబర్‌తో పూర్తవుతుందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ రెన్యువల్ చేయకూడదని విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2022-01-27T20:50:45+05:30 IST