ఎన్డీటీవీ ప్రమోటర్లకు సెబి షాక్...

ABN , First Publish Date - 2020-11-29T19:54:29+05:30 IST

ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ సహా పలువురిపై మార్కెట్ నియంత్రణ సంస్థ(సెబి) నిషేధం విధించింది. సెక్యూరిటీ మార్కెట్‌లో రెండేళ్ల పాటు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎన్డీటీవీ ప్రమోటర్లకు సెబి షాక్...

న్యూఢిల్లీ : ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ సహా పలువురిపై మార్కెట్ నియంత్రణ సంస్థ(సెబి) నిషేధం విధించింది. సెక్యూరిటీ మార్కెట్‌లో రెండేళ్ల పాటు ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పన్నెండేళ్ళ నాటి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో ఆయాచితంగా రూ. 16.97 కోట్ల మేర వీరు లబ్ధి పొందినట్లు వెల్లడైన విషఐయం తెలిసిందే. ఈ క్రమంలో... సెబి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా... ఈ నిర్ణయంపై ఎన్డీటీవీ అప్పీలుకు వెళ్ళనుంది. 


2006 సెప్టెంబర్ నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి... నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తించామని, ఈ క్రమంలోనే ప్రమోటర్ల పై ఈ చర్యలు తీసుకున్నామని సెబి వెల్లడించింది. నాటి కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి, ఆర్జించిన రూ. 16.97 కోట్లను వాపస్ చేయాలని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా... కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది. సెబి ఆదేశాలను తక్షణం సవాలు చేస్తామని ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తెలిపారు. ఎన్డీటీవీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన మరో ఏడుగురు వ్యక్తులు, సంస్థల పై కూడా సెబి ఏడాది నుండి రెండేళ్ల పాటు సెబి నిషేధం విధించింది. ఇందులో విక్రమాదిత్యచంద్ర, ఈశ్వరిప్రసాద్ బాజపాయి, సౌరవ్ బెనర్జీ, సంజయ్ దత్ సతీమణి ప్రణీత దత్, క్వాంటం సెక్యూరిటీస్, ఎస్ఏఎల్ రియల్ ఎస్టేట్, తాజ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఉన్నాయి. 


వడ్డీతో సహా చెల్లించాలి... 2006 సెప్టెంబరు నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఎన్డీటీవీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది.  కంపెనీ పునర్నిర్మాణానికి సంబంధించి చర్చలు 2007 సెప్టెంబరు 7నప్రారంభమయ్యాయి. కాగా... 2008 ఏప్రిల్ 16 న ఈ నిర్ణయం వెలువడింది. అయితే ప్రణయ్, రాధికలు 2008 ఏప్రిల్ 17 న షేర్ల విక్రయం ద్వారా కోట్లాది రూపాయల లాభం పొందినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. 2008 ఏప్రిల్ 17 నుండి ఆరు శాతం వడ్డీతో ఈ మొత్తాన్ని చెల్లించాలని సెబి ఆదేశాల సారాంశం. 


Updated Date - 2020-11-29T19:54:29+05:30 IST