ఎన్నికల ముందు అన్నాడీఎంకే కూటమికి షాక్..
ABN , First Publish Date - 2021-03-07T16:39:34+05:30 IST
జయలలిత సన్నిహితురాలు శశికళకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని
- ఎడప్పాడిపై నిప్పులు చిమ్మిన కరుణాస్
చెన్నై : అన్నాడీఎంకే కూటమి నుంచి ముక్కుళత్తోర్ పులిప్పడై వైదొలగినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ హాస్యనటుడు కరుణాస్ ప్రకటించారు. చెన్నైలో శనివారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సామాజిక న్యాయానికి గండికొట్టారని, తమ కులస్థులను మాయమాటలతో వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఏ కూటమికి మద్దతు ఇవ్వదని తెలిపారు. మదురై విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగదేవర్ పేరు పెడతామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చివరిదాకా తమను వంచించి మోసగించిందని ధ్వజమెత్తారు. ముక్కుళత్తోర్ కులస్థులను అన్నాడీఎంకే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, వారి సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు గానీ, హామీలు కాని ప్రకటించలేదని కరుణాస్ అన్నారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, దేవర్ కులస్థులను, తన కులమైన గౌండర్ కులస్థులకే అధిక ప్రాధాన్యతనిస్తూ ఇతర కులస్థులను ప్రత్యేకించి బలహీనవర్గాలకు చెందినవారికి తీరని అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని, ఆమె మద్దతుదారుడిగానే ఉంటానని తెలిపారు.