ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు షాక్‌!

ABN , First Publish Date - 2022-10-08T09:00:15+05:30 IST

యాప్‌ ఆధారితట్యాక్సీ సేవలందిస్తున్న ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది.

ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు షాక్‌!

ఆటో సేవలు నిలిపివేసిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): యాప్‌ ఆధారితట్యాక్సీ సేవలందిస్తున్న ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో రాష్ట్రంలో ఆటో సర్వీసులు నిలిపివేయాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు ఓలా కార్యకలాపాలను నిర్వహించే ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌, ఉబర్‌, ర్యాపిడో సంస్థలకు నోటీసులు జారీచేసింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరాలు సమర్పించాలని కోరింది. లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనల ప్రకారం కార్లను మాత్రమే ట్యాక్సీలుగా నడపాలి. ఆటోల ద్వారా సేవలందించడం నిబంధనలకు విరుద్ధం. పైగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే ఆయా సంస్థలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని రవాణాశాఖ కమిషనర్‌ టీఎంకే కుమార్‌ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్ల వరకు రూ.30 వసూలు చేయాలి. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.15 చొప్పున తీసుకోవాలి. కానీ, ఈ కంపెనీలు తొలి 2 కిలోమీటర్లకే రూ.100 వసూలు చేస్తున్నాయని కస్టమర్ల నుంచి పెద్దఎత్తును ఫిర్యాదులు అందాయి. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఆటో రిక్షాలు నడుపుతున్నారంటూ ఓలా, ఉబర్‌, ర్యాపిడో సంస్థలకు నోటీసులు జారీచేసిన ప్రభుత్వం.. ఆటో రిక్షా సేవలు నిలిపివేయాలని ఆదేశించింది.

Updated Date - 2022-10-08T09:00:15+05:30 IST