పైసల కోసం ప్రాణాలను పణంగా పెట్టం
ABN , First Publish Date - 2020-04-10T09:42:33+05:30 IST
కరోనాపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి భారత్, పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్
అక్తర్ ఇండో-పాక్ సిరీస్ ప్రతిపాదనపై కపిల్
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటం కోసం నిధులు సేకరించడానికి భారత్, పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనను భారత దిగ్గజం కపిల్దేవ్ తీవ్రంగా విమర్శించాడు. తమకు అలాంటి అగత్యం పట్టలేదన్నాడు. ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సమంజసం కాదని చురకంటించాడు. ఖాళీ స్టేడియాల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్లు నిర్వహించాలని.. టీవీల్లో ప్రసారమయ్యేలా చూస్తే మంచి రేటింగ్ వస్తుందని అక్తర్ సూచించాడు. ‘అతడి అభిప్రాయాన్ని చెప్పాడు. కానీ, మనకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా విపత్కర పరిస్థితుల్లో ఇరుదేశాల ప్రభుత్వాలు ఎలా సహరించుకుంటున్నాయన్నదే ముఖ్యం’ అని కపిల్ అన్నాడు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి అండగా బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ విరాళం ఇచ్చిందని.. అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటుందన్నాడు. రానున్న ఆరు నెలలపాటు క్రికెట్ గురించి ఆలోచించక పోవడమే మంచిదని కపిల్ అభిప్రాయపడ్డాడు.