శివరాత్రి ఉత్సవాలకు ఆర్కే బీచ్ ముస్తాబు
ABN , First Publish Date - 2020-02-20T08:33:26+05:30 IST
శివరాత్రి ఉత్సవాలకు ఆర్కే బీచ్ ముస్తాబు
విశాఖపట్నం, ఫిబ్రవరి 19: టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం మహాశివలింగం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాని సమీపంలోనే యజ్ఞశాల నిర్మిస్తున్నారు. ఈ శివరాత్రి ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు, రాష్ట్ర ప్రముఖులు, సినీప్రముఖులు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు రానున్న దృష్ట్యా వారి భద్రత కోసం ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మహాశివుడికి అభిషేకాలు జరుగనున్న దృష్ట్యా గురువారం నాటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్వాహకులు తలస్తున్నారు.
వైభవంగా వేడుకలు : టీఎస్సార్
రామ్నగర్, ఫిబ్రవరి 19: ఆర్కే బీచ్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్టు రాజ్యసభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాలలో కోటి శివలింగాలకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు. సాయంత్రం జరిగే ఆధ్యాత్మిక సభలో విశాఖ శారదాపీఠం స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని సత్కరించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ హాజరుకానున్నారన్నారు. గౌరవ అతిథులుగా సినీ నటులు మోహన్బాబు, మురళీమోహన్ బ్రహ్మానందంతో పాటు సినీ తారలు వాణిశ్రీ, జమున, శారదా, కవితా, మీనాతో పాటు పలువురు నాయకులు, గాయకులు హాజరుకానున్నారని తెలిపారు.