Shivamoggaలో మరో రెండు రోజులు కర్ఫ్యూ: Sp
ABN , First Publish Date - 2022-02-23T17:08:33+05:30 IST
బజరంగ్దళ్ కార్యకర్త హర్ష హత్యతో అట్టుడికి తీవ్ర హింసాకాండ చెలరేగిన శివమొగ్గలో మరో రెండు రోజుల పాటు కర్ఫ్యూను విస్తరించాలని నిర్ణయించినట్టు జిల్లా ఎస్పీ బీఎం లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. శివమొగ్గ నగరంలో
బెంగళూరు: బజరంగ్దళ్ కార్యకర్త హర్ష హత్యతో అట్టుడికి తీవ్ర హింసాకాండ చెలరేగిన శివమొగ్గలో మరో రెండు రోజుల పాటు కర్ఫ్యూను విస్తరించాలని నిర్ణయించినట్టు జిల్లా ఎస్పీ బీఎం లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. శివమొగ్గ నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం వరకు జిల్లాలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. హర్ష హత్యకేసుకు సంబంధించి ఇంతవరకు ఆరుగురిని అరెస్టు చేశామని, వీరిలో మహ్మద్ ఖాసిఫ్, సయ్యద్ నదీంలను కోర్టుకు హాజరు పరచగా జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిందన్నారు. మిగిలిన నలుగురిపై విచారణ కొనసాగుతోందన్నారు. కాగా ఈ హత్యకేసులో మొత్తం 12మందిని అదుపులోకి తీసుకుని ఆరుగురికి ప్రమేయంలేదని తేలడంతో విడిచిపెట్టామన్నారు. హత్య జరిగిన రోజే ఖాసిఫ్, నదీంలను శివమొగ్గలోనే అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మిగిలిన నలుగురిని కూడా వలపన్ని పట్టుకున్నామన్నారు. హత్యకేసులో మహ్మద్ ఖాసిఫ్, సయ్యద్ నదీం, ఆరిఫుల్లాఖాన్, రెహమాన్ షరీఫ్, నిహాన్, అబ్దుల్ అఫ్నన్లు పట్టుబడ్డారన్నారు. మరింత మంది ఉందే అవకాశం ఉందన్నారు.
బాధిత కుటుంబాన్నిపరామర్శించిన తేజస్వి సూర్య
కాగా బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్విసూర్య మంగళవారం భారీ పోలీసుబందోబస్తు నడుమ హర్ష కుటుంబీకులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. శివమొగ్గ ఘటనకు ఎస్డీపీఐ, పీఎఫ్ఐ సంఘాలే కారణమని ఆరోపించారు. నిందితులను ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.