ముర్ముకు శివసేన మద్దతు

ABN , First Publish Date - 2022-07-13T07:21:33+05:30 IST

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి దౌపది ముర్ముకు మద్దతివ్వాలని శివసేన పార్టీ నిర్ణయించింది.

ముర్ముకు శివసేన మద్దతు

సంకుచిత మనస్తత్వంతో లేం: ఠాక్రే

ముంబై, జూలై 12: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి దౌపది ముర్ముకు మద్దతివ్వాలని శివసేన పార్టీ నిర్ణయించింది. ఏ విధమైన ఒత్తిడి లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రే మంగళవారం వెల్లడించారు. ‘దీనిపై పార్టీ ఎంపీల సమావేశంలో నాపై ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు. గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం తొలిసారి వచ్చిందని మా పార్టీ గిరిజన నేతలు చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేను ఆమెకు మద్దతు ఇవ్వకూడదు. అయితే మేం అంతటి సంకుచిత మనస్తత్వంతో లేం’ అని ఠాక్రే పేర్కొన్నారు. గతంలో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థులు ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీలకు కూడా శివసేన మద్దతు ఇచ్చిందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ చెప్పారు. ‘శివసేనలో  రాజకీయాలకు అతీతంగా వెళ్లే సాంప్రదాయం ఉంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఎవరికైనా మద్దతిస్తాం’ అని రౌత్‌ పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉద్దవ్‌ ఠాక్రే నివాసంలో జరిగిన సమావేశంలో పార్టీ ఎంపీల్లో ఎక్కువ మంది ముర్ముకే మద్దతివ్వాలని కోరినట్టు తెలిసింది. మొత్తం 22 మంది ఎంపీల్లో 16 మంది ముర్ముకే మద్దతివ్వాలని సూచించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర జనాభాలో 10 శాతం ఆదివాసీలున్నారు. మరోవైపు ముర్ముకు మద్దతిచ్చినంత మాత్రాన బీజేపీకి సపోర్ట్‌ చేసినట్టు కాదని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. టీడీపీ, వైసీపీ, శివసేన తదితర ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించడంతో ముర్ముకు 60 శాతానికిపైగా ఓట్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-07-13T07:21:33+05:30 IST