యూపీఏపై మమత వ్యాఖ్యలను పట్టించుకోని శివసేన

ABN , First Publish Date - 2021-12-05T00:16:29+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత

యూపీఏపై మమత వ్యాఖ్యలను పట్టించుకోని శివసేన

ముంబై : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి శివసేన ఝలక్ ఇచ్చింది. ‘‘ఇప్పుడు యూపీఏ ఉనికే లేదు’’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో, కాంగ్రెస్ లేకుండా యూపీఏకు సమాంతర కూటమిని ఏర్పాటు చేయడమంటే అధికార బీజేపీని, ఫాస్టిస్టు శక్తులను బలోపేతం చేయడమేనని పేర్కొంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వద్దని అనుకునేవారు తెర చాటున మాట్లాడుతూ అయోమయం సృష్టించడానికి బదులుగా, తమ వైఖరిని బహిరంగంగా స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. 


‘‘మమత బెనర్జీ ముంబై పర్యటన తర్వాత ప్రతిపక్ష పార్టీలు పని మొదలుపెట్టాయి. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంపై ఏకాభిప్రాయం ఉంది. కానీ ఈ కూటమిలో ఎవరికి చోటు ఇవ్వాలి? ఎవరిని దూరంగా ఉంచాలి? అనేదానిపై చాలా చర్చ జరుగుతోంది. అయితే ఐకమత్యం లేకపోతే, బీజేపీపై పోరాడటం గురించి ఎవరూ మాట్లాడకూడదు. నాయకత్వం అనేది తదుపరి అంశం, అయితే కలిసికట్టుగా ఒక చోటుకు రావడంపై కనీసం ఓ నిర్ణయం జరగాలి’’ అని ‘సామ్నా’ సంపాదకీయం పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ ఓడిపోవాలని కోరుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చునని, ఇది వారి ఎజెండాలో భాగమని తెలిపింది. అయితే మోదీ, బీజేపీలకు వ్యతిరేకులు కూడా కాంగ్రెస్ చెడును కోరుకోవడం చాలా పెద్ద ప్రమాదం అని వివరించింది. 


మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉంది. మమత బెనర్జీ ఇటీవల ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె శివసేన నేతలు ఆదిత్య థాకరే, సంజయ్ రౌత్‌, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌లతో భేటీ అయ్యారు.  ఈ రెండు పార్టీలతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని టీఎంసీ కోరుకుంటోందన్నారు. టీఎంసీని జాతీయ స్థాయిలో విస్తరించాలని మమత ఆకాంక్షిస్తున్నారు. ఈ దిశగా ఆమె ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. 



Updated Date - 2021-12-05T00:16:29+05:30 IST