పార్టీ గుర్తుపై రభస.. ‘శివసేన’ ఉద్ధవ్ది కాదంటున్న షిండే వర్గం
ABN , First Publish Date - 2022-07-10T19:54:51+05:30 IST
ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ను గద్దెదించి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన
ముంబై: ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ను గద్దెదించి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) వర్గం మరో షాకింగ్ కామెంట్ చేసింది. శివసేన పార్టీ బాలాసాహెబ్ది, ఆయన శివసైనికులదని స్పష్టం చేసింది. ఈ మేరకు షిండే వర్గానికి చెందిన దీపక్ కేసార్కర్ (Deepak Kesarkar) పేర్కొన్నారు. అందరినీ ఆదరించేలా ఉద్ధవ్కు కూడా బాలాసాహెబ్ (Balasaheb) లాంటి హృదయం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు. శివసేన (Shiv Sena) పార్టీ గుర్తు కోసం ఇరు వర్గాలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
షిండే వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యే గులాబ్ రావ్ బుధవారం మట్లాడుతూ.. పార్టీ గుర్తుకు నిజమైన హక్కుదారు ముఖ్యమంత్రి షిండేనే అని పేర్కొన్నారు. కాగా, ఉద్ధవ్ వర్గానికి చెందిన లోక్సభ ఎంపీ వినాయక్ రౌత్.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలకు సవాలు విసిరారు. దమ్ముంటే వారు పార్టీని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీకి సవాలు విసిరారు.
బాలాసాహెబ్ స్థాపించిన పార్టీ గుర్తును కోరే అధికారం రెబల్స్కు లేదని ఆయన స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలికేందుకు బీజేపీ మధ్యంత ఎన్నికలకు వెళ్లాలని వినాయక్ రౌత్ డిమాండ్ చేశారు.