కేరళ ఎన్నికల్లో తారల తళుకు
ABN , First Publish Date - 2021-03-30T07:33:25+05:30 IST
తారల ప్రచారంతో కేరళ ఎన్నికలు తళుకులీనుతున్నాయి. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. సినీ, టీవీ నటీనటులను ఆయా పార్టీలు అభ్యర్థులుగా రంగంలోకి దింపాయి. త్రిసూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత
తిరువనంతపురం, మార్చి 29: తారల ప్రచారంతో కేరళ ఎన్నికలు తళుకులీనుతున్నాయి. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. సినీ, టీవీ నటీనటులను ఆయా పార్టీలు అభ్యర్థులుగా రంగంలోకి దింపాయి. త్రిసూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ ఎంపీ, మలయాళీ స్టార్ సురేశ్ గోపి బరిలో ఉన్నారు. రోడ్షోలతో ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే, పతనపురం నుంచి పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కేబీ గణేశ్ కుమార్ గతంలో మంత్రిగా పని చేశారు. 1985లో సినిమాల్లోకి ప్రవేశించారు. కొల్లాం ఎల్డీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముకేశ్.. హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందారు.
తిరువనంతపురం నుంచి జీ.కృష్ణకుమార్(బీజేపీ), బాలుస్సేరి నుంచి ధర్మాజన్ బాల్గట్టీ (కాంగ్రెస్) కూడా సినీ నటులే. ఎల్డీఎఫ్ సీటు నిరాకరించడంతో పాల స్థానంలో యూడీఎఫ్ అభ్యర్థిగా సీ.కప్పన్ బరిలో నిలిచారు. ఆయన 25 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఆరూర్లో నేపథ్యగాయని దలీమా జోజో పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే టీవీ నటి ప్రియాంకా అనూప్ స్వతంత్ర అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న వివేక్ గోపన్.. బీజేపీ అభ్యర్థిగా చవర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.