Maharashtra: ఆ ప్రస్తావన లేకుండానే.. థాకరేకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పిన షిండే
ABN , First Publish Date - 2022-07-27T21:33:17+05:30 IST
శివసేన చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే బుధవారంనాడు పుట్టినరోజు శుభాకాంక్షలు...
ముంబై: శివసేన చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (uddhav Thackeray)కు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (Eknath shinde) బుధవారంనాడు పుట్టినరోజు శుభాకాంక్షలు (birthday wishes) తెలిపారు. అయితే, ఉద్ధవ్ను శివసేన చీఫ్గా సంబోధించకుండా షిండే జాగ్రత్త పడ్డారు.
''మాజీ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంతో, చిరకాలం జీవించాలని కోరుకుంటున్నాను'' అని ఏక్నాథ్ షిండే బుధవారం ఉదయం ఓ ట్వీట్లో తెలిపారు. గత జూన్లో షిండే 39 మంది శివసేన ఎమ్మెల్యేలు, 10 మంది ఇండిపెండెంట్లతో కలిసి పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఇటీవలే 19 మంది శివసేన లోక్సభ ఎంపీలు షిండే శిబిరానికి మద్దతు ఇవ్వడంతో తన వర్గం వారితో నేషనల్ ఎగ్జిక్యూటివ్ను ఆయన ఏర్పాటు చేశారు. తమదే నిజమైన శివసేనగా ప్రకటించుకున్నారు. ఈసీ వద్ద పార్టీ గుర్తును క్లెయిమ్ చేశారు. దీంతో థాకరే సారథ్యంలోని శివసేన, షిండే గ్రూప్ మధ్య న్యాయపోరాటం మొదలైంది. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అనర్హత నోటీసుపై తేల్చకుండా పార్తీ గుర్తుపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని, ఈసీని నిలువరించాలని కోరుతూ థాకరే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.