బస్సులో ఇద్దరు పసికందులతో మహిళ జర్నీ.. సడన్‌గా ఓ బిడ్డ ఏడవడంతో వెలుగులోకి దారుణ నిజం

ABN , First Publish Date - 2021-08-26T16:24:59+05:30 IST

చీకటి పడిన తర్వాత ఒక గ్రామం మీదుగా వెళ్తున్న ఆ బస్సును పోలీసులు అడ్డగించారు. బస్సులోకి వెళ్లి అందర్నీ పరిశీలిస్తున్నారు.

బస్సులో ఇద్దరు పసికందులతో మహిళ జర్నీ.. సడన్‌గా ఓ బిడ్డ ఏడవడంతో వెలుగులోకి దారుణ నిజం

ఇంటర్నెట్ డెస్క్: చీకటి పడిన తర్వాత ఒక గ్రామం మీదుగా వెళ్తున్న ఆ బస్సును పోలీసులు అడ్డగించారు. బస్సులోకి వెళ్లి అందర్నీ పరిశీలిస్తున్నారు. ఇంతలో ఒక మూలగా ఉన్న సీటులో నుంచి ఒక పసివాడి ఏడుపు వినపడింది. ఒక మహిళ ఆ పసివాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె దగ్గరకు వెళ్లిన పోలీసులు.. విషయమేంటని ప్రశ్నించారు. వాళ్లను చూసి తత్తరపడిన ఆమె.. ఏవేవో సాకులు చెప్పడం మొదలు పెట్టింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను బస్సు దింపారు. గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆమె దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలు ఆమె సంతానం కాదు. వారిలో ఒక పసివాడి వయసు రెండున్నర నెలలు కాగా, మరో శిశువు వయసు కేవలం మూడ్రోజులే. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగు చూసింది.


కటనీ జిల్లా ఆస్పత్రిలో నుంచి ఒక 3 రోజుల శిశువును ఎవరో ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. ఒక మహిళ ఈ పసికందును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆమె ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లే ముందు చీర మార్చుకున్నట్లు గుర్తించారు. ఆమె కోసం గాలింపు చర్యల్లో భాగంగానే.. జబల్‌పూర్ వెళ్తున్న బస్సును అడ్డగించారు. ఆ బస్సులోనే ఇద్దరు పసివాళ్లతో ఆమె పోలీసులకు దొరికిపోయింది. ఆమె వద్ద మూడు, నాలుగు చీరలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సదరు యువతి కటనీ జిల్లా ఆస్పత్రి ప్రసూతి వార్డులో చాలా సేపు ఉందని, పసివాడిని ఎత్తుకెళ్లే ముందు ఆ తల్లితో మాటలు కలిపిందని పోలీసులు చెప్పారు. సదరు తల్లి కుటుంబం ఇంటికి వెళ్లిన సమయంలో ఆ శిశువును తీసుకొని పరారైంది. ఆమె నుంచి ఇద్దరు పసివాళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పసివాళ్లను వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

Updated Date - 2021-08-26T16:24:59+05:30 IST