భర్త చేసిన నీచమైన పనిని చెప్పుకోలేకపోయింది.. కానీ అక్క పరిస్థితి గమనించి చెల్లెలు ఆరా తీయగా.. భయంకరమైన విషయం వెలుగులోకి..!
ABN , First Publish Date - 2021-10-24T18:57:05+05:30 IST
భర్త చేసిన పనిని ఆ భార్య ఎవరికీ..
ఇంటర్నెట్డెస్క్: తాగుబోతు భర్త చేసిన పనిని ఆ భార్య ఎవరికీ చెప్పుకోలేకపోయింది. కానీ ఇంటికొచ్చిన అక్క పరిస్థితి గమనించి సోదరి ఆరా తీయగా.. భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాజస్థాన్లోని బద్నోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..
బద్నోర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి ట్రక్ డ్రైవర్గా పని చేస్తుంటాడు. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. తాగినప్పుడల్లా భార్యతో గొడవపడేవాడు. అక్టోబర్ 18న రాత్రి సమయంలో మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఆమెను కొట్టి.. ఆమె సోదరి ఇంటి దగ్గర వదిలివెళ్లిపోయాడు. భార్యభర్తల మధ్య ఎప్పుడూ ఉండే గొడవలే కదా.. అని ఆమె సోదరి భావించింది. ఇంటికొచ్చిన అక్క ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడం మొదలవడంతో చెల్లెలికి అనుమానం కలిగింది. ఏమైంది అక్కా.. అని అడగ్గా అసలు విషయం చెప్పింది.
అక్టోబర్ 18న జరిగిన గొడవలో భర్త చేసిన నీచమైన పని గురించి చెప్పింది. ‘సోమవారం రాత్రి మీ బావ మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఎప్పటిలాగే నాతో మళ్లీ గొడవపెట్టుకున్నాడు. కానీ అతడి కోపం తగ్గకపోవడంతో.. ఒక పదునైన కట్టె తీసుకుని.. ఎవరికీ చెప్పుకోలేని చోట చొప్పించి చిత్రహింసలకు గురి చేశాడు. చివరికి నీ వద్ద వదిలివెళ్లాడు’అని చెప్పింది. బావ చేసిన పని తెలిసి ఆమె తీవ్రంగా బాధపడింది. అక్క ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. వాళ్ల ఇంటికి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. శనివారం ఉదయం ఆమెకు మరోసారి చికిత్స అందిస్తుండగా చనిపోయింది. మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు. అదే రోజు సాయంత్రం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా.. ఆమె శరీరంలో కొన్ని చెక్క ముక్కలు ఉన్నట్టు తెలిసింది. అక్క మరణానికి కారణమైన బావపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.
బద్నోర్ పోలీస్స్టేషన్ ఇన్చార్జి వినోద్ కుమార్ మీనా మాట్లాడుతూ నిందితుడు ఓ ట్రక్ డ్రైవర్ అని, మద్యం అలవాటు ఉన్న అతడు నిత్యం భార్యతో గొడవపడేవాడన్నారు. సోమవారం జరిగిన గొడవలో ఆమెకు విపరీతమైన దెబ్బలు తగిలాయన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని, నిందితుడిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించామన్నారు.