India Map: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ మళ్లీ వివాదంలో చిక్కిన శశిథరూర్
ABN , First Publish Date - 2022-10-01T00:34:16+05:30 IST
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన శుక్రవారంనాడే తిరువనంతరం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన శుక్రవారంనాడే తిరువనంతరం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన శుక్రవారంనాడే తిరువనంతరం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi tharoor) వివాదంలో (Controversy) చిక్కుకున్నారు. 'ఇండియా మ్యాప్' (India Map) విషయంలో ఆయన ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల కోసం ఆయన కార్యాలయం ఒక బుక్లెట్ (Manifesto) విడుదల చేసింది. ఇందులో భాగంగా జమ్మూ-లఢక్ ప్రాంతాలు లేని ఇండియన్ మ్యాప్ను విడుదల చేసింది. ఈ చర్య ఇటు పార్టీ వర్గాలను ఉలిక్కిపడేలా చేయగా, ఊహించని విధంగా బీజేపీకి పదునైన అస్త్రం దొరకడంతో.. భారత్ను వక్రీకరించారంటూ శశిథరూర్పై విమర్శలు గుప్పించింది.
''శశిథరూర్కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు'' అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శశిథరూర్ కార్యాలయంపై విమర్శలు గుప్పించారు. విభజనను శశిథరూర్ కోరుకుంటున్నారని ఆరోపించారు.
మ్యాప్ తొలగించిన థరూర్ కార్యాలయం
కాగా, మేనిఫెస్టోలోని ఇండియా మ్యాప్ వివాాదానికి దారితీయడంతో శశిథరూర్ కార్యాలయం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఒరిజినల్ మ్యాప్ను చేర్చి, సవరించిన మేనిఫెస్టోను తిరిగి పోస్ట్ చేసింది.
శశిథరూర్...గత వివాదాలు
మ్యాప్ సంబంధిత వివాదంలో శశిథరూర్ చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. 2019లోనూ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్ నిరసనకు సంబంధించిన బుక్లెట్ కవర్ను ఆయన షేర్ చేశారు. అప్పుడు కూడా లఢక్, జమ్మూకశ్మీర్లు లేని భారత్ మ్యాప్ను వాడారు. బీజేపీ విరుచుకుపడటంతో జరిగిన పొరపాటును గ్రహించి ఆతర్వాత మ్యాప్ను తొలగించారు.