ఈ భారతీయ సంతతి సీఈఓ ‘రొమాన్స్‌కు బాస్’! ఆనంద్ మహీంద్రానే అబ్బురపరిచిన వ్యాపారవేత్త.. !

ABN , First Publish Date - 2021-12-31T01:38:17+05:30 IST

ఆనంద్ మహీంద్రానే అబ్బురపరిచిన భారతీయ సంతతి సీఈఓ

ఈ భారతీయ సంతతి సీఈఓ ‘రొమాన్స్‌కు బాస్’! ఆనంద్ మహీంద్రానే అబ్బురపరిచిన వ్యాపారవేత్త.. !

ఇంటర్నెట్ డెస్క్: మీరు డేటింగ్ యాప్ ‘టిండర్’ పేరు ఎప్పుడన్నా విన్నారా..అంటే యువతరంలో దాదాపు అందరూ ఔననే సమాధానం ఇస్తారు. మరి శర్మిష్ఠ దూబే ఎవరో తెలుసా అని అడిగితే.. మాత్రం తెల్ల మొహం వేస్తారు. మనమే కాదు.. శర్మిష్ఠ దూబే గురించి విన్న ప్రముఖ ఆనంద్ మహీంద్రా కూడా మొదట  అవాక్కయ్యారు. టిండర్ వెనకున్నది భారతీయ సంతతి వ్యక్తా.. అంటూ ఆశ్చర్యపోయారు. ఎందరో ఒంటరి పక్షులను ప్రేమనగరానికి చేరుస్తున్న టిండర్, ఒకేక్యూపిడ్, హింజ్ వంటి డేటింగ్ వేదికల వెనకున్నది శర్మిష్ఠ అని తెలిసి ఆశ్చర్యపోయారు. 

ఈ డేటింగ్ వేదికలను రూపొందించిన మాతృసంస్థ మ్యాచ్ గ్రూప్‌కు శర్మిష్ఠ దూబే సీఈఓ. ప్రచారానికి దూరంగా ఉండే శర్మీష్ట కూడా భారతీయ సంతతి వారేనన్న విషయం బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు. భారతీయ సంతతి సీఈఓలంటే మనకు సుందర్ పిచాయ్, సత్య నాదేళ్ల, పరాగ్ అగర్వాల్ టక్కున గుర్తుకొస్తారు. కానీ.. అదే స్థాయిలో విజయాలను అందుకున్న శర్మిష్ఠ మాత్రం అంతగా ప్రచారానికి నోచుకోలేదు. 

‘‘నిజం చెప్పాలంటే..  ఈ వ్యాపారవేత్త గురించి నేనూ తొలిసారిగా వింటున్నాను. భారతీయ సంతతి సీఈఓల లిస్టులో ఆమె ప్రస్తావన ఎక్కువగా రాలేదు. ఎందుకు ఇలా..? కేవలం డేటింగ్ యాప్‌‌లు, సైట్లకు నేతృత్వం వహిస్తున్నారన్న కారణంగానేనా..? ప్రపంచంలోనే అత్యంత పాపులర్ యాప్ టిండర్! కాబట్టి.. ఆమె అదే స్థాయి పాపులారిటీకి అర్హురాలు’’ అంటూ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. 


టిండర్, ఒకేక్యూపిడ్, హింజ్, Match.com వంటి డేటింగ్ వేదికలను రూపొందించిన మ్యాచ్ గ్రూప్‌కు శర్మిష్ఠ సీఈఓ. డేటింట్ అంశాన్ని 40 బిలియన్ డాలర్ల వ్యాపారంగా తీర్చిదిద్దారు శర్మిష్ఠ. ఆమెకు బాస్ ఆఫ్ రొమ్యాన్స్ అని పేరు. జమ్‌షెడ్‌పూర్‌లో పుట్టి పెరిగిన ఆమె 1993లో ఐఐటీ నుంచి మెటలర్జీకల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తరువాత ఏడాది పాటు ఇండియాలోనే ఉద్యోగం చేసి..ఆ తరువాత పైచదువుల కోసం అమెరికాకు వెళ్లారు. 2006లో శర్మిష్ఠ మ్యాచ్ గ్రూప్‌‌లో చేరారు. ఓ డేటింట్ అంకుర సంస్థ కెమిస్ట్రీ‌కి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 



2006 నుంచి మ్యాచ్ గ్రూప్‌లో కొనసాగుతున్న ఆమె పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2017లో ఆమె టిండర్‌కు సీఓఓగా నియమితులయ్యారు. ఇక 2020 మార్చిలో మ్యాచ్ గ్రూప్ సీఈఓగా ఎంపికయ్యారు. సీఈఓ బాధ్యతులు తీసుకున్న సమయంలో కరోనా సంక్షోభం ప్రపంచాన్ని కమ్మెసింది. అనేక వ్యాపార సంస్థలు తీవ్ర నష్టాలు మూటకట్టుకున్నాయి. మరికొన్ని ఏకంగా కార్యకలాపాలే నిలిపేవేశాయి. కానీ.. శర్మిష్ఠ సారథ్యంలోని మ్యాచ్ గ్రూప్ మాత్రం మంచి లాభాలను కళ్ల చూస్తూ తన అప్రతిహత ప్రయాణాన్ని కొనసాగించింది. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. ఐఐటీలో ఉండగా.. ఆమె తన క్లాసులో ఉన్న ఒకే ఒక విద్యార్థిని! అంతేకాదు.. తన తరగతిలోనే ఉన్న అనేక మంది విద్యార్థుల్లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఒకరు. 

Updated Date - 2021-12-31T01:38:17+05:30 IST