Suryapet: మంచినీళ్లు లేవు కానీ.. మద్యం ఏరులై పారుతోంది: Sharmila
ABN , First Publish Date - 2022-07-06T20:01:07+05:30 IST
షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం సూర్యాపేట జిల్లా, అమరారం గ్రామంలో జరుగుతోంది.
సూర్యాపేట (Suryapet): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం సూర్యాపేట జిల్లా, అమరారం గ్రామంలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరారం గ్రామానికి మంచినీళ్లు లేవు కానీ గ్రామంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. మూడు గంటలు వర్షంలో కూర్చుని న్యాయం కోసం ధర్నా చేస్తే కానీ సర్కార్ లొంగలేదన్నారు. సీఎం కేసీఅర్ పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తామంటూ తనను బెదిరిస్తున్నారని.. ఎలా చెయ్యనియ్యరో చూద్దామని పాదయాత్ర చేస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రపై టీఆర్ఎస్ నేతలు మంగళవారం దాడి చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ కార్యకర్తలు రెండు సార్లు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయగా.. తమ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల ధర్నాకు దిగారు. జోరువాన కురుస్తున్నా నాలుగు గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు. బా ధ్యులపై చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి స్వయంగా హామీ ఇవ్వడంతో రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆమె నిరసన విరమించారు.