వాటాల గోల..!

ABN , First Publish Date - 2020-06-03T10:04:45+05:30 IST

నిధులను ఆదా చేసేందుకు జగన్‌ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టింది.

వాటాల గోల..!

  • 14వ ఆర్థిక సంఘం నిధులు
  • రూ.32.46 కోట్లతో ప్రగతి పనులు
  • ఆ నిధులపై ఇద్దరు కీలక నేతల కన్ను
  • పర్సెంటేజీలు ఇచ్చిన వారికే పనులు
  • రికార్డుల కోసమే టెండర్లు


కడప, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): నిధులను ఆదా చేసేందుకు జగన్‌ సర్కారు రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని అన్నింటా రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని వైసీపీ సర్కారు ఘనంగా చెప్పుకుంటోంది. కోట్లాది రూపాయల సొమ్మును ఆదా చేసి ఖజానాకు జమ చే శామని చెబుతోంది. అయితే సీఎం సొంత జిల్లా కడపలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధుల్లో పర్సెంటేజీలు తీసుకుని కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కాంట్రాక్టర్లలో హాట్‌ టాపిక్‌గా మారింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూపాయి ఆదా అయినా చాలు అని సీఎం జగన్‌ భావిస్తుంటే అదే రూపాయి మా జేబుల్లోకి ఎలా వేసుకోవాలని కొందరు వ్యూహ రచన చేయడం ఆసక్తి రేపుతోంది. 


కడప కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించింది. మెరుగైన తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టులు, బీటీ రోడ్లు తదితర నిర్మాణాలకు వెచ్చించాల్సి ఉంది. కార్పొరేషన్‌ పరిధిలో రూ.32.46 కోట్ల వ్యయంతో 221 పనులను చేపట్టాలని అంచనాలను రూపొందించారు. ఇందులో పైప్‌లైను, డ్రైనేజీ, కల్వర్టులు, అంతర్గత రహదారులు తదితర పనులను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 5న టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో పని అంచనా వ్యయం రూ.5 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంది. 


కీలక నేతల కన్ను

14వ ఆర్థిక సంఘం నిధులపై ఇద్దరు ‘కీలక’ నేతలు కన్నేసినట్లు చెబుతారు. టెండరు నిర్వహిస్తే కాంట్రాక్టర్లు పోటీ పడి లెస్‌కు దాఖలు చేస్తారు. దీనివల్ల మాకేంటి అని ఆ కొందరు అనుకున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లను రింగ్‌ చేసి పర్సెంటేజీలు ఇచ్చిన వారికే పనులు కేటాయిస్తే లాభమని భావించి ఆ దిశగా రంగంలోకి దిగినట్లు సమాచారం. కడపకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి మీరెవరు పోటీ పడి లెస్‌లకు టెండరు వేయకండి. మీ అందరికీ పనులు వచ్చేలా చూస్తాం. పర్సెంటేజీలు మాత్రం ఇవ్వాలని సమావేశంలో చెప్పినట్లు సమాచారం. ఆన్‌లైన్‌ టెండర్లే కదా.. బయటి వ్యక్తులు ఎవరైనా లెస్‌కు టెండరు దాఖలు చేస్తే ఇబ్బంది కదా అని కొందరు కాంట్రాక్టర్లు సందేహం వ్యక్తం చేయగా బయటి వ్యక్తులు వచ్చి ఇక్కడ పనులు చేయడం అంత ఈజీ కాదు.


మనం చెప్పినా వినకుండా టెండరు వేస్తే ఎలా రద్దు చేయాలో మనకు తెలుసు. ఒకవేళ వేసినా రకరకాల అడ్డంకులు సృష్టిస్తాం. టెండరు ఎవరూ వేయకుండా మేం చూస్తాం అని చెప్పినట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్‌లో 120 మంది వరకు రిజిస్టరు కాంట్రాక్టర్లు ఉండగా  ఆ సమావేశానికి 20 మంది హాజరైనట్లు తెలుస్తోంది. 


డీల్‌కు ఒకే.....

పోటీ లేకుండా చేస్తే పర్సెంటేజీలు ఇచ్చే డీల్‌కు కాంట్రాక్టర్లు ఒకే అనడంతో ఎవరెవరికి ఎన్నెన్ని పనులు కేటాయించి... ఫైనలేజ్‌ చేసేందుకు ఆ ఇద్దరు ఐదు మంది మాజీ ప్రజా ప్రతినిధులతో కమిటీ వేసినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి ఎన్ని పనులు కేటాయించాలన్నదానిపై జాబితా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


పర్సెంటేజీలపై సందిగ్థత

నిబంధనల ప్రకారం 14వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం సూచించిన వాటికే ఖర్చు చేయాల్సి ఉంది. అయితే సుమారు రూ.6 కోట్లను నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో పనులు చేపట్టేందుకు కేటాయించారు. 18 పనులు గుర్తించి టెండర్లను ఆహ్వానించారు. ఈ పనులకు సంబంధించి 8 శాతం పర్సెంటేజీ ఇచ్చేలా ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థిక సంఘం నిధులను నాడు-నేడు పనులకు ఉపయోగించకూడదని అభ్యంతరాలు రావడంతో రద్దు చేశారు.


ఇప్పుడు చేపట్టబోయే పనుల్లో 10 నుంచి 12 శాతం పర్సెంటేజీలు ఇచ్చేలా కాంట్రాక్టర్లతో ఆ కమిటీ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పర్సెంటేజీల డీల్‌ ఖరారైతే టెండర్ల ప్రక్రియ నామమాత్రంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో లాగా 30 శాతం లెస్‌కు కాంట్రాక్టర్లు పోటీ పడి టెండర్లు వేయరని చెబుతున్నారు. మొత్తానికైతే రాష్ట్రమంతా రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలవుతుంటే కడపలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-06-03T10:04:45+05:30 IST