మహిళలకు చట్టసభల్లో 50 శాతం వాటాకు ‘జై’

ABN , First Publish Date - 2022-03-05T00:07:41+05:30 IST

మహిళా దినోత్సవం పురస్కరించుకుని జాతీయ మహిళా కమిషన్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని

మహిళలకు చట్టసభల్లో 50 శాతం వాటాకు ‘జై’

గుంటూరు: మహిళా దినోత్సవం పురస్కరించుకుని జాతీయ మహిళా కమిషన్‌ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా జాతీయ మహిళా పార్లమెంటు -2022 శుక్రవారం అట్టహాసంగా జరిగింది. పార్లమెంటు స్పీకర్‌గా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నేతృత్వంలో మాక్‌ పార్లమెంటు సమావేశం ఉత్సాహంగా సాగింది. పార్లమెంటు సమావేశాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ), ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలత, వర్సిటీ వీసీ రాజశేఖర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ నేటికీ మహిళలపై అత్యాచారాలు, అనేక అఘాయిత్యాలు జరగటం ఆందోళనకరమన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించాలన్నారు.


సీఎం జగన్‌ మహిళాభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, రూ.లక్షా 30వేల కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. అత్యాచార కేసుల్లో నేరస్తులకు రెండు నుంచి వారం రోజుల్లోనే చార్జిషీట్‌ దాఖలు చేసేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలకు స్థానిక సంస్థల్లో, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 


సమావేశంలో తీర్మానాలు

చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళా పార్లమెంటు తీర్మానం చేసి ఆమోదించింది. అలానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న దిశ చట్టాన్ని ఆమోదించారు. మహిళలకు వివాహ వయస్సు పరిమితి 21 ఏళ్ళు సబబేనంటూ సమావేశం వేదికగా ఆమోదించారు. మరో ఐదు అంశాలపై చర్చించారు. కమిషన్‌ సభ్యులు కేంద్ర మంత్రులుగా వ్యవహరించారు. సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు మహిళా అధికారులు, కళాశాలల విద్యార్థినులు హాజరయ్యారు.

Updated Date - 2022-03-05T00:07:41+05:30 IST