అన్నపూర్ణాదేవిగా జములమ్మ
ABN , First Publish Date - 2022-09-28T05:46:54+05:30 IST
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జములమ్మ ఆలయంలో అమ్మవారు రెండవ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
- వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
- వివిధ అలంకరణల్లో అమ్మవార్ల దర్శనం
- ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
గద్వాల, సెప్టెంబరు 27 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జములమ్మ ఆలయంలో అమ్మవారు రెండవ రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. మొదటి పూజను చైర్మన్ కుర్వ సతీష్కుమార్, ఈవో కవిత నిర్వహించారు. దాదాపు 10 వేల మంది భక్తు లు అమ్మవారిని దర్శించుకున్నారు. మంజునాథ స్వర మాధురి ఆర్కెస్ర్టా ఆధ్వర్యంలో భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఏకే నర్సింహారెడ్డి బృందం సంకీర్తనలు, జానపదగేయాలాపన, బతుక మ్మ పాటలతో అలరించారు.
మంగళగౌరీ దేవీగా..
గద్వాల టౌన్ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం గద్వాల పట్ట ణంలోని పలు ఆలయాల్లో అమ్మవారు మంగళగౌరీ దేవీగా భక్తుల పూజలందుకున్నారు.వాసవీ కన్యాకా పరమేశ్వరి, అన్నపూర్ణ ఆలయం, తాయమ్మ ఆలయా లతో పాటు కుమ్మరి శాలివాహనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు మంగళగౌరీ దేవిగా భక్తుల పూజలు అందుకున్నారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో హరిద్రాంబికా దేవిగా, పాండురంగ శివాలయంలో బ్రహ్మచారిణీ దేవిగా, భక్తమార్కండేయ స్వామి ఆలయంలో అన్న పూర్ణాదేవిగా అమ్మవారు కొలువుదీరారు. ఈ సందర్భం గా మహిళలు కుంకుమార్చన చేసి మొక్కులు తీర్చుకున్నారు.
విజయలక్ష్మీ దేవిగా..
ఇటిక్యాల : శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవరోజు మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని సరస్వతీ అలయంలో అమ్మవారు విజయలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకుడు భువనచద్ర, ఆలయ మేనేజర్ సురేంద్రరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అంజనేయస్వామి అలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారు మంగళగౌరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకుడు మారుతి ఆచారి ఆధ్వర్యంలో పూజలు చేశారు. మునుగాల జమ్ములమ్మ అలయంలో అమ్మవారు మంగళగౌరీ దేవిగా దర్శనం ఇవ్వారు. గ్రామస్థులు, దాతల సహకారంతో ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అన్నదానం చేయనున్నట్లు పూజారి ఎల్లగౌడు తెలిపారు.
రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో..
మల్దకల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మల్దకల్ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తుల పూజలందుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి పాల్గొన్నారు. వాసవీ మాత దేవాలయంలో అమ్మవారు రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నరహరి ప్రవీన్, గణేకల్ సత్యనారాయణ, ఇల్లూరు అశోక్, పల్లా వెంకటేశ్, గుంజపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు బాదం శ్రీనివాసులు, బ్యాంకు నాగరాజు, ఇల్లూరు నాగరాజు పాల్గొన్నారు.
బాలాత్రిపురసుందరీదేవిగా..
గట్టు : గట్టులోని అంబాభవానీ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అయిజ : పట్టణంలోని అంబాభవానీ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
వడ్డేపల్లి : మునిసిపాలిటీ పరిధిలోని పైపాడులో ఉన్న వాల్మీకి గుడి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి అలంకరణలో భక్తుల పూజలందుకున్నారు.