రాజన్న క్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-27T06:00:04+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
- స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం
వేములవాడ, సెప్టెంబరు 26: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి సందర్భంగా ఉదయం ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు స్వస్తి పుణ్యహవచనము చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులకు, వేదపండితులకు ఆలయ ఏఈవో బి.శ్రీనివాస్ వరుణి అందజేశారు. అనంతరం అర్చకులు పంచగవ్య మిశ్రణము, అఖండ దీపస్థాపన, కలశ స్థాపన, గాయత్రి ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. గాయత్రి జపం, గాయత్రీ హవనము నిర్వహించారు. లక్ష్మీగణపతి, రాజరాజేశ్వరస్వామివారలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి శ్రీసూక్తము ద్వారా మహాభిషేకం, అభ్యంగన స్నానం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ఠి పూజ నిర్వహించారు. సప్తశతి పారాయణం, లలితోపాఖ్యానం, సాయంత్రం నాలుగు గంటలకు శ్రీదేవీ భాగవత పురాణ ప్రవచనం చేపట్టారు.
శైలపుత్రి అలంకారంలో అమ్మవారు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ప్రారంభమైన శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా తొలిరోజు సోమవారం అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారిని శైలపుత్రి అవతారంలో అలంకరించారు. ప్రధాన ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా మహిషాసుర మర్ధిని, బాలాత్రిపురాసుందరీదేవి, బద్దిపోచమ్మ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, గాయత్రీదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.