జనజీవనంలోకి శారదక్క
ABN , First Publish Date - 2021-09-18T08:13:43+05:30 IST
మావోయిస్టు పార్టీ నాయకురాలు జజ్జెరి సమ్మక్క అలియాస్ శారద అలియాస్ శారదక్క జనజీవన స్రవంతిలో కలిశారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన హరిభూషణ్ భార్య
హైదరాబాద్, గంగారం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ నాయకురాలు జజ్జెరి సమ్మక్క అలియాస్ శారద అలియాస్ శారదక్క జనజీవన స్రవంతిలో కలిశారు. ఆమె భర్త, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు హరిభూషణ్ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో పాటు మావోయిస్టు పార్టీలో మారిన సిద్ధాంతాలతో పనిచేయలేక శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి వివరాలు వెల్లడించారు.
ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామం శారద స్వస్థలం. ఆమె 1994లో మైనర్గా ఉన్నప్పుడే తన బావ హరిభూషణ్ కోసం మావోయిస్టు పార్టీలో చేరారు. 1995లో హరిభూషణ్, శారదల వివాహం జరిగింది. 2008లోనే వరంగల్ ఎస్పీ ఎదుట శారద లొంగిపోయారు. దళంలోకి తిరిగి రాకుంటే వేరొకరిని పెళ్లిచేసుకుంటానని హరిభూషణ్ బెదిరించడంతో 2011లో ఆమె తిరిగి అడవిబాట పట్టారు. ఇటీవల హరిభూషణ్ చనిపోవడంతో.. ఆమె లొంగిపోయారు.