సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి

ABN , First Publish Date - 2020-02-14T23:29:56+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా?

సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఎల్గార్ పరిషత్ కేసు వీరిద్దరి మధ్యా చిచ్చు పెట్టిందా? అంటే అవుననే అంటున్నాయి ఎన్సీపీ వర్గాలు. ఎల్గార్ పరిషత్ కేసును సీఎం ఉద్ధవ్ ఎన్‌ఐఏకి అప్పగించడంపై శరద్ పవార్ అగ్గిమీద గుగ్గిలమైనారు. ఈ విషయంలో శరద్ పవార్ ఉద్ధవ్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘ఎల్గార్ పరిషత్ కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడం మరీ దారుణం’’ అని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేంద్రం ఆ పరిధిలోకి చొచ్చుకొని రావడం మరీ దారుణమని ఆయన మండిపడ్డారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలో మహా వికాస్ అగాఢీ సేనగా ఏర్పడిన తర్వాత శరద్ పవార్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే ప్రథమం. 


ఈ కేసును పుణే పోలీసుల నుంచి ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. దర్యాప్తులో కేంద్రానికి అన్ని అధికారాలు ఉన్నప్పటికీ... తమను సంప్రదించకుండా ఎన్ఐఏకి ఎలా అప్పగిస్తారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ కేసు విచారణ సిట్‌తోనే జరిపించాలంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు.దీనికి భిన్నంగా సీఎం ఉద్ధవ్ ఎన్‌ఐఏకి అప్పగించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-02-14T23:29:56+05:30 IST