మహారాష్ట్ర సర్కారు నడుపుతున్నది శరద్ పవార్..బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-10-30T14:19:44+05:30 IST
మహారాష్ట్ర సర్కారుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు....
ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్ర సర్కారుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అని చంద్రకాంత్ చెప్పారు. మహారాష్ట్రలో ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కాదని, శరద్ పవార్ ను కలవాలని పాటిల్ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. విద్యుత్ బిల్లుల పెంపుపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే గవర్నరును కలవగా, భగత్ సింగ్ కోష్యారి శరద్ పవార్ ను కలవాలని సలహా ఇవ్వడంపై ప్రశ్నించగా పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘గవర్నర్ ఏం చెప్పారో నాకు తెలియదు, కాని మీరు నన్ను అడిగితే, రాష్ట్రాన్ని నడుపుతున్నది శరద్ పవార్ అని నేను చెపుతాను .... ఉద్ధవ్ ఠాక్రేని కలవడం వల్ల ఉపయోగం ఏమిటి?’’ అని పాటిల్ ప్రశ్నించారు. సమస్య పరిష్కరించాలంటే పవార్ ను కలవాలని పాటిల్ చమత్కరించారు. తాను గత 9 నెలల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి తాను రాసిన లేఖలకు ఒక్క సమాధానం కూడా రాలేదని బీజేపీ చీఫ్ పాటిల్ చెప్పారు.