వరద ప్రాంతాల్లో థాకరే పర్యటనను ప్రశ్నించిన పవార్
ABN , First Publish Date - 2021-07-27T19:25:53+05:30 IST
మహారాష్ట్రలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్..
ముంబై: మహారాష్ట్రలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పర్యటించడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారంనాడు నిశిత వ్యాఖ్యలు చేశారు. సహాయ కార్యక్రమాలతో నేరుగా సంబంధం లేని వ్యక్తులు ఇలాంటి పర్యటనలకు దూరంగా ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎన్సీపీ ఎలాంటి చర్యలు చేపడుతోందని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. సహాయ కార్యక్రమాలతో నేరుగా సంబంధం లేని వ్యక్తులు ఇలాంటి పర్యటనలకు దూరంగా ఉండటమే మంచిదనేది తన వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నానని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవని, అయితే వీఐపీలు వెళ్లడం వల్ల సహాయక కార్యక్రమాలకు అంతరాయం కలగవచ్చని పేర్కొన్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో గవర్నర్ బీఎస్ కోషియార్ సైతం మంగళవారం పర్యటించిన విషయమై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారంగా మరిన్ని నిధులు రప్పించడానికి బహుశా ఆయన పర్యటన ఉపకరించవచ్చని అన్నారు. దీనికి ముందు, వరద బాధిత చిప్లున్ ప్రాంతంలో గత ఆదివారంనాడు ఉద్ధవ్ పర్యటించారు. జరిగిన నష్టం, కొనసాగుతున్న సహాయక కార్యక్రమలపై అధికారులు, స్థానిక ప్రతినిధులతో సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సైతం సాంగ్లి జిల్లాలోని వరద బాధత ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. రెస్క్యూ పడవలో ఆయన కొన్ని ప్రాంతాలను సందర్శించారు. మహారాష్ట్రలో వర్షాలు సృష్టించిన విలయంతో మృతుల సంఖ్య 192కు చేరింది. ఎక్కువ మరణాలు రాయ్గఢ్లో చోటుచేసుకున్నాయి. 2 లక్షల 30 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.