Maharashtra: ఏక్నాథ్ షిండేకు గవర్నర్ పుష్పగుచ్ఛం ఇవ్వడంపై శరద్ పవార్ వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-07-03T15:50:48+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ
న్యూఢిల్లీ : మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం చేసినపుడు ఆయనకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ (Bhagat Singh Koshyari) పుష్పగుచ్ఛం ఇవ్వడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. తాను 1967 నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమాలను చూస్తున్నానని, తాను కూడా 1972 నుంచి 1990 వరకు ప్రమాణ స్వీకారాలు చేశానని, అయితే ఈసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా ముఖ్యమంత్రికి గవర్నర్ పుష్పగుచ్ఛం ఇవ్వడం చూశానని అన్నారు.
శరద్ పవార్ ఓ వార్తా సంస్థతో శనివారం మాట్లాడుతూ, ‘‘నేను చాలా ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాను. కానీ నాకు ఏ గవర్నరూ స్వీట్స్, బొకేలు ఇవ్వలేదు’’ అని చెప్పారు. షిండే, ఫడ్నవీస్లకు గవర్నర్ స్వీట్లు తినిపించారని, బొకేలతో శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారని అన్నారు. ఆయనలో గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. 2019లో మహా వికాస్ అగాడీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గవర్నర్ కోషియారీ విభిన్నంగా ప్రవర్తించారన్నారు. కచ్చితంగా నిబంధనలను పాటించాలని ఆయన చెప్పారన్నారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని చెప్పారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటపుడు ప్రముఖుల పేర్లను ప్రస్తావించవద్దని ఆయన చెప్పారని తెలిపారు. ఆయన తన పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారని తెలిపారు.
ఉద్ధవ్ థాకరే రాజీనామా అనంతరం ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ సభాపతి ఎన్నిక ఆదివారం జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే రాజన్ సాల్వి సభాపతి పదవి కోసం పోటీ పడుతున్నారు.