సీఎం జగన్‌ది మూర్ఖపు నిర్ణయం: శరద్ పవార్

ABN , First Publish Date - 2022-04-06T18:38:46+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు.

సీఎం జగన్‌ది మూర్ఖపు నిర్ణయం: శరద్ పవార్

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రెండు శాసన రాజధానులు ఉన్నాయి. వాటినే మేము వృధా అనుకుంటున్నాం. అలాంటిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూడు రాజధానులా? ఇదేలా సాధ్యం? ఇది మూర్ఖపు  నిర్ణయం.. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై పార్లమెంట్‌లో చర్చకు వస్తే అమరావతికే మద్దతు పలుకుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజుతోనూ అమరావతి జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. దీనిపై రాహుల్‌తో చర్చిస్తానని రాజు హామీ ఇచ్చారు. పలువురు కేంద్రమంత్రులతో అమరావతి జేఏసీ నేతలు సమావేశమయ్యారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, బిల్డ్ అమరావతికి సహకరించాలని అభ్యర్ధించారు.


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, చిన్న సూక్ష్మ మద్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను జేఏసీ నేతలు కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను జేఏసీ నేతలు కలుసుకున్నారు. అమరావతిపై కేంద్ర మంత్రులు, ఆయా పార్టీ నేతలను కలుసుకోవడానికి దాదాపు 120 మంది జేఏసీ ప్రతినిధులు ఢిల్లీ వచ్చారు. వారు బృందాలుగా విడిపోయి పార్టీల నేతలు, మంత్రులను కలుస్తున్నారు. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కాబట్టి అమరావతి అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ బృందాలకు జేఏసీ నేతలు మాదాల శ్రీనివాస్, శ్యాంకిషోర్, సుంకర పద్మశ్రీ, రాయపాటి శైలజ, సుధాకర్ నేతృత్వం వహించారు. మరో రెండు రోజుల పాటు జేఏసీ నేతలు ఢిల్లీలోనే ఉంటారు.

Updated Date - 2022-04-06T18:38:46+05:30 IST