వాషింగ్టన్: బిహార్లోని చిన్న మారుమూల ప్రాంతమైన జిరాదేవి గ్రామానికి చెందిన యువకుడికి.. అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనివర్సిటీలోని స్టూడెంట్ కౌన్సిల్కు తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్గా ఎన్నికయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్కు చెందిన శరద్ వివేక్ సాగర్.. హార్వర్డ్ గ్రాడ్యూయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్(హెచ్జీఎస్ఈ)కు సంబంధించిన స్టూడెంట్ కౌన్సిల్కు తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్గా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం శరద్ సాగర్తోపాటు మొత్తం తొమ్మిది మంది పోటీ పడగా.. సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 50 దేశాలకు చెందిన సుమారు 1200 మంది విద్యార్థులు.. శరద్ సాగర్ను స్టూడెంట్ కౌన్సిల్ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో స్పందించిన శరద్ సాగర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. శరద్ సాగర్ తన 16వ ఏటనే డెక్స్టెరిటీ గ్లోబల్ను జాతీయ సంస్థను స్థాపించారు. ఈ క్రమంలో అతను పోర్బ్స్ విడుదల చేసిన 30ఏళ్లలోపు అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తల జాబితాలో చోటు సంపాదించారు. 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు యంగ్ లీడర్లను శ్వేతసౌధానికి పిలిచి వారితో సమావేశమయ్యారు. భారత్ నుంచి ఈ సమావేశంలో శరద్ సాగర్ పాల్గొన్నారు. అదే సంవత్సరం నార్వేలో జరిగిన నోబెల్ పీస్ ప్రైజ్ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా శరద్ సాగర్ కు ఆహ్వానం కూడా వచ్చింది.