శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-01-23T02:04:28+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు శనివారం 6ఈ025 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు లగేజీని తనిఖీలు చేయగా 2715.800 గ్రాముల బంగారం బయట పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వివరాలు సేకరించారు. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.కోటిన్నరకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కొంత బంగారం గొలుసుల రూపంలో ఉండగా మరి కొంత బంగారాన్ని ఫేస్ట్గా మార్చి తీసుకొస్తున్నాడని అధికారులు వెల్లడించారు.