అంపైర్ అవుట్ ఇవ్వలేదని, వికెట్లను తన్ని, పీకి పారేసిన స్టార్ క్రికెటర్
ABN , First Publish Date - 2021-06-12T03:11:14+05:30 IST
అంపైర్ అవుట్ ఇవ్వలేదని బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ మైదానంలో విచిత్రంగా ప్రవర్తించాడు. క్రికెట్ సమాజం తలదించుకునే విధంగా..
అంపైర్ అవుట్ ఇవ్వలేదని బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ మైదానంలో విచిత్రంగా ప్రవర్తించాడు. క్రికెట్ సమాజం తలదించుకునే విధంగా.. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ప్రవర్తించని విధంగా మైదానంలో ప్రవర్తించాడు. తన బౌలింగ్ లో అవుట్ ప్రత్యర్థి బ్యాట్స్మన్ అవుటైనా.. అంపైర్ అవుటివ్వలేదు. దీంతో వెంటనే నాన్స్ట్రైకర్ ఎండ్లోని వికెట్లను షకిబ్ బలంగా కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్లో షకిబ్ ప్రవర్తన ఇప్పుడు క్రికెట్ లోకాన్నే దిగ్భాంతికి గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఈ టోర్నీలో షకిబ్ అల్ హసన్ మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఈ జట్టు అబహాని లిమిటెడ్ జట్టుతో తలపడింది. ఈ క్రమంలోనే అంపైర్ నిర్ణయంపై పూర్తి అసహనానికి గురైన షకిబ్.. మతి కోల్పోయినట్లు ప్రవర్తించాడు. అసహనంతో వికెట్లను తన్నడంతో పాటు అంపైర్ పైకి దూసుకెళ్లాడు.
అలాగే అదే మ్యాచ్ దాదాపు పూర్తయిన సమయంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న షకిబ్.. మరోసారి అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అలాగేఅంపైర్ను దుర్భాషలాడుతూ, వికెట్లను పీకి విసిరేశాడు. అయితే షకీబ్ వ్యవహరించిన తీరు కచ్చితంగా ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది. మరి దీనిపై బీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం షకిబ్ చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. షకిబ్ చర్య నిజంగా క్రికెట్ లోకం సిగ్గుపడాల్సిన ఘటన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.