బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ: శైలజనాధ్
ABN , First Publish Date - 2021-10-05T20:15:30+05:30 IST
బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్ స్పష్టం చేశారు.
గుంటూరు: బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాధ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి.. ప్రజలోకి వెళుతున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామన్నారు. దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. రాష్టంలో పరిపాలన రోజు రోజుకీ దారుణంగా మారుతోందని, అప్పుల బాధతో ప్రభుత్వం తలమునకలు అవుతోందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయన్నారు. బీజేపీని ప్రశ్నించలేని అసమర్థతలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి బద్వేలులో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ ఆపాలంటే.. అది కాంగ్రెస్తోనే సాధ్యమని శైలజనాధ్ అన్నారు.