ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా షెఫాలీ వర్మ

ABN , First Publish Date - 2021-06-20T01:56:53+05:30 IST

ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో మిథాలీ సేన ఓటమి నుంచి బయటపడేందుకు పోరాడుతోంది.

ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా షెఫాలీ వర్మ

బ్రిస్టల్: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో మిథాలీ సేన ఓటమి నుంచి బయటపడేందుకు పోరాడుతోంది. ప్రస్తుతానికి స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండడంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు ఓటమి ఖాయం. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు యువ ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన రికార్డు సృష్టించింది.


ఆరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా నాలుగో మహిళా క్రికెటర్‌గా తన పేరును లిఖించుకుంది. 22 ఏళ్ల షెఫాలీ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయింది. రెండో ఇన్సింగ్స్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 83 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేసింది.


షెఫాలీ కంటే ముందు జోనాస్సేన్, శ్రీలంకకు చెందిన వెనెస్సా బోవెన్, ఇంగ్లండ్‌కు చెందిన లెల్సీ కుక్ అరంగేట్ర టెస్టులో రెండు అర్ధ సెంచరీలు సాధించారు. కాగా, ఫాలో ఆన్ ఆడుతున్న మిథాలీ సేన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి  237 పరుగులు చేసి ఇంగ్లండ్‌ కంటే 73 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో స్నేహ్ రాణా (26), శిఖా పాండే (17) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-06-20T01:56:53+05:30 IST