రేషన్ దుకాణల్లో సర్వర్ సమస్య
ABN , First Publish Date - 2020-04-03T11:19:12+05:30 IST
ఆన్లైన్ మొరాయింపుతో రేషన్ తీసుకోవడం పరేషాన్గా మారింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా మనిషికి 12కేజీల బియ్యం పంపిణీ పట్టణ పరిధిలో గు
పాల్వంచ టౌన్ : ఆన్లైన్ మొరాయింపుతో రేషన్ తీసుకోవడం పరేషాన్గా మారింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా మనిషికి 12కేజీల బియ్యం పంపిణీ పట్టణ పరిధిలో గురువారం నుంచి మొదలైంది. దాంతో రేషన్ దుకాణాల వద్దకు వినియోగదారులు పెద్ద మొత్తంలో వస్తున్నారు. నిర్వాహకులు సామాజిక దూరంతో గడీలు ఏర్పాటు చేసినప్పటికీ వినియోగదారులు దానిని పట్టించుకోవడమే మరిచారు. ఆన్లైన్ సేవలు వేగంగా జరిగేలా కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కూసుమంచి : లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక రేషన్ బియ్యం అందజేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కొన్నిచోట్ల సర్వర్ పనిచేయకపోవడంతో లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. దీంతో దుకాణానికి వచ్చి గంటలకొద్ది ఎదురు చూడాల్సి వచ్చింది. ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళితే హైదరాబాద్లోనే సెంట్రల్ సర్వర్ సమస్య ఉందంటూ చెపుతున్నారని డీలర్లు తెలిపారు. ఇప్పటికైన సాంకేతిక సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. రేషన్ దుకాణల్లో ఈపాస్ యంత్రాలకు సంబంధించి సర్వర్ సమస్య ఉన్నమాట వాస్తవమేనని, ఈవిషయం హైదరాబాద్లో సివిల్ సప్లై కమిషనర్ దృష్టికితీసుకెళ్లామని తహసీల్దార్ శిరీష వివరణ ఇచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నామని విరించారు. ఈపాస్ యంత్రాలు సరిగా పని చేయడం లేదన్నారు.
అశ్వారావుపేట : మండలంలోని 24 రేషన్ డిపోల ద్వారా పేదలకు బియ్యం పంపిణీని ప్రారంభించారు. మొదటి రోజు బియ్యం పంపిణీలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు కేంద్రాల్లో బయో మెట్రిక్ యంత్రం పనిచేయకపోవడంతో రెడ్డిగూడెం, వినాయకపురం వంటి చాలా గ్రామాల్లో మధ్యాహ్నం వరకు బియ్యం పంపిణీ ప్రారంభమే కాలేదు. ఇవే కాకా ప్రతి కేంద్రంలోను సర్వర్లు బిజీ రావడంతో కనీసం గంట కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగలేదు. కేంద్రాల వద్ద ఎండకు జనం అల్లాడిపోయారు. రేషన్ దుకాణాల వద్ద సౌకర్యాలు కల్పించాలని అధికారుల దృష్టికి పలువురు తీసుకువెళ్లారు.