కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై సొంత జిల్లాలో కాంగ్రెస్ విజయం

ABN , First Publish Date - 2021-11-02T21:57:38+05:30 IST

కర్ణాటకలోని హనగళ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై సొంత జిల్లాలో కాంగ్రెస్ విజయం

బెంగళూరు: కర్ణాటకలోని హనగళ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ సొంత జిల్లా అయిన ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ మానే 7,598 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


బొమ్మై అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ శ్రీనివాస్ ఆధిక్యం ప్రదర్శించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్లను లెక్కించారు. కాంగ్రెస్‌కు 87,113 ఓట్లు రాగా, బీజేపీకి 79,515 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ ఓట్లలో మాత్రం బీజేపీకి 236 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 184, జేడీఎస్‌కు నాలుగు ఓట్లు వచ్చాయి.


ప్రారంభ రౌండ్లలో కాంగ్రెస్ 200 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రౌండ్లు పెరిగే కొద్దీ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. అప్పటి వరకు హుబ్బళిలో ఉన్న శ్రీనివాస్.. ఆధిక్యం ఐదు వేల ఓట్లు దాటగానే ఓట్లు లెక్కింపు జరుగుతున్న హవేరీకి బయలుదేరారు. కాంగ్రెస్ పూర్తిస్థాయి ఆధిక్యంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ మానే, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అనుకూల నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ కార్యకర్తలు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. 


విజయం సాధించిన అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. డబ్బు బలం ఓడిపోయిందని, ప్రజాబలం విజయం సాధించిందని అన్నారు. బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు తమ నేతలు చాలా కష్టపడ్డారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ చెత్త పాలనకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-02T21:57:38+05:30 IST