ఎంవీఐ కార్యాలయాల్లో సేవల పునరుద్ధరణ
ABN , First Publish Date - 2021-10-24T05:36:59+05:30 IST
కరోనా ఆంక్షల సడలింపుతో ఎంవీఐ కార్యాలయాల్లో అన్ని సేవలను పునరుద్ధరించినట్టు జిల్లా ఉప రవాణా శాఖాధికారిణి సిరి ఆనంద్ తెలిపారు.
కొవ్వూరు, అక్టోబరు 23 : కరోనా ఆంక్షల సడలింపుతో ఎంవీఐ కార్యాలయాల్లో అన్ని సేవలను పునరుద్ధరించినట్టు జిల్లా ఉప రవాణా శాఖాధికారిణి సిరి ఆనంద్ తెలిపారు. కొవ్వూరు ఎంవీఐ కార్యాలయాన్ని శనివారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎంవీఐ పరిధిలో వారానికి రెండు రోజులు రహదారి భద్రత, రవాణా శాఖ ఆన్లైన్ సర్వీసులపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ప్రతి రెండు నెలలకు రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. కొవ్వూరు పరిసరాల్లో క్వారీ టిప్పర్లతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, టిప్పర్ లారీలు మెటల్, ఇసుక లోడ్పై టార్పాలిన్ కప్పాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎంవీఐ వెంకటరమణ పాల్గొన్నారు.