ప్రైవేటు ట్రయేజ్ కేంద్రాల్లో ఉచితంగానే సేవలు
ABN , First Publish Date - 2021-05-06T05:40:57+05:30 IST
కరోనా బాధితులకు మూడు రకాల పరీక్షలు నిర్వహించి వైరస్ తీవ్రతను అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ట్రయేజ్ కేంద్రాల్లో సేవలన్నీ ఉచితంగానే లభిస్తాయని కేంద్రాలకు సంబంధించిన అధికారులు పేర్కొన్నారు.
కలికిరి, మే 5: కరోనా బాధితులకు మూడు రకాల పరీక్షలు నిర్వహించి వైరస్ తీవ్రతను అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ట్రయేజ్ కేంద్రాల్లో సేవలన్నీ ఉచితంగానే లభిస్తాయని కేంద్రాలకు సంబంధించిన అధికారులు పేర్కొన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత బాధితుల్లోని వ్యాధి స్థాయిని మదింపు చేయడానికి అవసరమైన పరీక్షలు చేయడానికి మండల కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను అనుమతించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు పలువురు బాధితులు స్పందించి పరీక్షలు ఉచితమా లేక ఫీజు చెల్లించాలా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రక్తపరీక్ష, ఈసీజీ, ఎక్స్ రేలకు బాధితులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పనిలేదని, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లా పడమటి ప్రాంతాలకు మదనపల్లె, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో రెండు ట్రయేజ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే కరోనా సోకిన బాధితులను 108 వాహనాల్లో ఈ కేంద్రాలకు చేర్చేవారు. అయితే పరీక్షల అనంతరం వారిని సుదూరంగా వుండే స్వస్థలాలకు తరలించడానికి వాహన సౌకర్యం లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రయేజ్ పరీక్షలు నిర్వహించడానికి తాజాగా అనుమతించడంతో బాధితులు పరీక్షలు చేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. కలికిరిలోని వెంకటసాయి ఆసుపత్రిలో బుధవారం 16 మందికి పరీక్షలు నిర్వహించగా 15 మందిని హోమ్ ఐసొలేషన్కు సిఫారసు చేశారు. ఒకరిని మాత్రం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.