సేవా స్ఫూర్తి అవసరం
ABN , First Publish Date - 2020-09-23T11:27:35+05:30 IST
జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సేవా స్ఫూర్తితో ప్రజలకు సహాయ పడాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు సూచించారు.
విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు
విజయనగరం క్రైమ్, సెప్టెంబరు 22: జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సేవా స్ఫూర్తితో ప్రజలకు సహాయ పడాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు సూచించారు. జిల్లా పోలీసులతో మంగళవారం ఆయన జూమ్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్-19తో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బంది ఎక్కువగా అనారోగ్యం పాలయ్యారని విచారం వ్యక్తం చేశారు.
జాగ్రత్తలు పాటిస్తూ సేవలు అందించాలని సూచించారు. స్టేషన్లలో పనిచేసే హోమ్ గార్డు నుంచి ఎస్ఐ స్థాయి వరకు భౌతిక దూరం పాటించడం.. మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించడంతో పాటు కరోనా నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
వారు చెప్పిన బాధలను ఓపికగా విని పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం, అధికారం పోలీస్ ఉద్యోగులకు మాత్రమే లభిస్తుందని గుర్తు చేశారు. ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించినా.. అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.