రోగులకు మెరుగైన సేవలందించండి : డీఎంహె చ్వో
ABN , First Publish Date - 2022-08-19T06:37:24+05:30 IST
పీహెచ్సీల్లో మంచిగా వైద్య సేవలు అందిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే రోగులు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హేమంత తెలిపారు.
మాకవరపాలెం, ఆగస్టు 18: పీహెచ్సీల్లో మంచిగా వైద్య సేవలు అందిస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే రోగులు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హేమంత తెలిపారు. రోగులకు ఎళ్లవేళలా వైద్య సేవలు అందించాలన్నారు. గురువారం బూరుగుపాలెం పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబరు నాటికి ఫ్యామిలీ డాక్టరు వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ కొవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. అలాగే ప్రతి సోమవారం సచివాలయంలో బూస్టర్ డోస్ వేస్తున్నారని, దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో చేపట్టే మినీ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు నవంబరు నాటికి పూర్తిచేయాలన్నారు. అలాగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకంపై అవగాహన కల్పించాలన్నారు. కాన్పులు పీహెచ్సీల్లోగాని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాని జరిగేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. హైరిస్కు గర్భవతుల పట్ల జాగ్రత్తగా ఉంటూ వారిని ఆనుక్షణం కనిపెట్టుకుని ఉండాలన్నారు. పీహెచ్సీలోని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు షరిష్మా, పావని, లలిత పాల్గొన్నారు.